
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్ 15లోపు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తిప్పాపూర్ శివారులోని బస్డిపో వద్ద గల 144 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ, ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మాణం చేయలేదన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మాణం చేపడుతోందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. బస్డిపో వద్ద 144 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే గతంలో మంజూరుపత్రాలు అందజేశామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, గృహ నిర్మాణశాఖ పీడీ శంకర్, ఆర్అండ్బీ డీఈ శాంత య్య, వరప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.