ఒంగోలు టౌన్: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం కార్మికుల హక్కులను కాలరాస్తూ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఏప్రిల్ ఒకటో తేదీన బ్లాక్ డే నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి యం.రమేష్ తెలిపారు. సోమవారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటో తేదీన కార్మికులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి పనికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్మికులను బలిపీఠం ఎక్కించే లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో కార్మికుల పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొత్తకోట వెంకటేశ్వర్లు, సీహెచ్ మోజెస్, ఎంఎస్ సాయి, మంజుదార్ పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: బ్యాంకు ఉద్యోగులపై పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఐదు రోజుల పనిదినాన్ని అమలు చేయాలని కెనరా బ్యాంకు అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ కె.రవికుమార్ డిమాండ్ చేశారు. అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో జరిగిన బ్యాంకు అధికారుల సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం బ్యాంకు అధికారులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకు ఉద్యోగులు నైపుణ్యాన్ని, నైతికతను దెబ్బతీయవద్దని కోరారు. బ్యాంకింక్ రంగంలో 90 శాతం వ్యాపారం క్షేత్రస్థాయి సిబ్బంది వల్లనే జరుగుతుందని స్పష్టం చేశారు. కెనరా బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం రీజనల్ హెడ్ బీమా రాఘవేంద్ర, సంఘం తిరుపతి సర్కిల్ డీజీఎస్ హిమతేజ రెడ్డి, ఏజీ ఎస్ కిషోర్ రెడ్డి, రీజనల్ సెక్రటరీ రఘువర్మ, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.


