సింగరాయకొండ: మండలంలోని పాకల గ్రామానికి చెందిన జనసేన మండల అధికార ప్రతినిధి సంకె నాగరాజుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు దాడి చేసి గాయపరిచారు. స్థానికుల కథనం ప్రకారం సంకె నాగరాజు, సైకం ఫణీంద్ర కలిసి చేపల వ్యాపారం చేశారు. ఈ వ్యాపారం కోసం సంకె నాగరాజుతో రూ. 4.50 లక్షలు పెట్టుబడి పెట్టించాడు. కానీ ఆదాయంలో ఒక్క రూపాయి ఇవ్వకపోగా పెట్టుబడిని కూడా సైకం ఫణీంద్ర తన ఆధీనంలో ఉంచుకున్నాడు. నగదు విషయమై పెద్దల సమక్షంలో పంచాయతీ జరగ్గా రూ.2.50 లక్షలు ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకుని రూ. లక్ష ఇచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు. సోమవారం బస్టాండ్ సెంటర్లోని సంకె నాగరాజు స్టూడియో వద్దకు వచ్చిన ఫణీంద్రను డబ్బులు ఇవ్వాలని అడగగా నన్నే డబ్బులు అడుగుతావా, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను డబ్బులు అడుగుతావు అంటూ గొడవ చేసి వెళ్లి తరువాత తన తండ్రి సైకం సుబ్బారావు, తమ్ముడు సైకం ఆనంద్, అతని బాబాయి మొత్తం నలుగురు కర్రలు తీసుకుని వచ్చి సంకె నాగరాజుపై దాడి చేశారు. అతని సెల్ఫోన్ను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలిసి జనసేన మండల ప్రదాన కార్యదర్శి కాసుల శ్రీనివాసులు గాయపడ్డ నాగరాజును కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. నాగరాజును జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కనపర్తి మనోజ్కుమార్, మండల అధ్యక్షుడు అయినాబత్తిన రాజేష్ పరామర్శించి దోషులకు శిక్ష పడే వరకు న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.


