కాలుష్య నియంత్రణ మండలి, అధికారులు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కు అధికారుల తీరుపై గ్రామస్తుల మండిపాటు
బల్లికురవ: క్వారీ ఏర్పాటులో పర్యావరణ–ప్రజాభిప్రాయ సేకరణకు సమీప గ్రామాల ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి అనుమతులు పొందాలి. ప్రజాభిప్రాయ సేకరణలో మీ గ్రామ అభివృద్ధికి పాటుపడతాం, నిరుద్యోగ యువతకు క్వారీలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అంటూ నిర్వాహకులు హామీలు గుప్పించారు. అయితే ఈ హామీలు నీటి మూటలే తప్ప ఆచరణలో కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు. గురువారం బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ క్వారీల వద్ద గుట్టు చప్పుడు కాకుండా రెండు గ్రామాల వ్యాపారులు, దళారులతో అభిప్రాయ సేకరణతో మమ అనిపించారు... వివరాల్లోకి వెళితే..కొణిదెన రెవెన్యూలోని సర్వే నంబర్ 339–3డి, 3బీ, 996–3బీలో 5,446 హెక్టార్కు గ్రావెల్ సాధారణ మట్టిరోడ్ మెటల్ 47999 క్యూబిక్ మీటర్లకు, కలర్ గ్రానైట్ 11999 క్యూబిక్ మీటర్లకు డీఎం గ్రానైట్ క్వారీ అనుతులతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. క్వారీ ఏర్పాటు ఏసే సమీప గ్రామాలైన బల్లికురవ, నక్కబొక్కలపాడు, చెన్నుపల్లి, కొండాయపాలెం, మల్లాయపాలెం, వేమవరం, కొప్పరపాలెం, కొణిదెన గ్రామాల్లో ప్రజా ప్రతినిధులకు ఆహ్వానంతో పాటు ప్రజలకు మైక్ ద్వారా ప్రచారం చేపట్టాల్సి ఉంది. అయితే ఇవేమి చేయకుండా తమకు అనుకూలమైన వేమవరం, మల్లాయపాలెం గ్రామాలకు చెందిన వ్యాపారస్తులు, దళారులను పిలిపించుకుని ఇక్కడ క్వారీ ఏర్పాటులో ఇబ్బందులు ఏమీ లేవని పథకం ప్రకారం అంతా ఒకే అని చెప్పించుకున్నారు. బతుకుదెరువుకు పరాయి రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు ఇక్కడ క్వారీలో భద్రత చర్యలు, నిబంధనలు పాటించకపోవటంతో ప్రాణలు గాల్లో కలిసి పోతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు అయ్యో పాపం అంటున్న అధికారులు..మాముళ్ల మత్తులో క్వారీల వైపు కన్నెత్తి చూడటంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు అద్దంకి ఆర్డీఓ జాన్సన్, తహసీల్దార్ రవినాయక్, పర్యావరణ శాఖ అధికారులు గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు హజరయ్యారు.


