ఒంగోలు సిటీ: జిల్లా ప్రజలకు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగ నాగార్జున, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలపు సురేష్, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జిలు అన్నా రాంబాబు, కె.నాగార్జునరెడ్డి, దద్దాల నారాయణ యాదవ్లు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
జె.పంగులూరు: శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని పంగులూరులో ఈ నెల 28న రాష్ట్రస్థాయి బండ లాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో మొదటి బహుమతి రూ.20 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు, నాల్గవ బహుమతి రూ.7 వేలు, ఐదో బహుమతి రూ.5 , ఆరో బహుమతి రూ.3 వేలు అందజేస్తామన్నారు. పూర్తి వివరాలకు 9848909630, 9948425772 నంబర్లను సంప్రదించాలని కోరారు.
టంగుటూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన వల్లూరమ్మ ఆలయంలో గురువారం హుండీలను దేవదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకుడు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తం 3 నెలల 21 రోజులకు గాను 10 హుండీలు లెక్కించగా రూ.18, 25, 257 నగదు, 5 గ్రాముల బంగారం, 33 గ్రాముల వెండి, 51 అమెరికా డాలర్లు వచ్చినట్లు ఆలయ ఈఓ బి.రమేష్ తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ బొజ్జా శ్రీనివాసులు, సభ్యులు సుమన్, ఆలయ అర్చకులు, శ్రీనివాస సేవా సంఘ సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
అద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో గురువారం హుండీని లెక్కించారు. మొత్తం 41 రోజులకు గాను రూ.24,18,460 ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం తిమ్మనాయుడు తెలిపారు. లెక్కింపును అమరావతి అమరలింగేశ్వరస్వామి దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ కె.రేఖ పర్యవేక్షించారు. దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకరరావు, పాలకమండలి సభ్యలు పాల్గొన్నారు.
● చికిత్స పొందుతూ ట్రాక్టర్ డ్రైవర్ మృతి
టంగుటూరు: ముందు వెళ్తున్న ట్రాక్టర్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం జూనో బేకరీ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే..ఒంగోలు వైపు వెళుతున్న ట్రాక్టర్ను వెనుక వస్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడగా డ్రైవర్ నామాల బాష తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం 108 అంబులెన్సులో ఒంగోలులోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న హైవే మొబైల్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా లారీ, ట్రాక్టర్ను పక్కకు జరిపారు.


