అకస్మాత్తుగా బస్సులో పెద్ద శబ్దం వచ్చింది. నిద్రలో ఉన్న మేము లేచి చూసేసరికి మంటలు పెరుగుతూ ఉన్నాయి. కాసేపు ఏం జరిగిందో అర్థం కాలేదు. బస్సులో ఒక్కసారిగా అందరూ కేకలు పెట్టడం గందరగోళంగా ఉంది. వెంటనే పక్కన ఉన్న ఎగ్జిట్ డోర్ తీసి బస్సులో నుంచి బయటికి దూకాం. నాకు కాలు, తలపై, భుజంపై దెబ్బలు తగిలాయి. నాతోపాటు ముగ్గురం బయటికి వచ్చాం. మరో వ్యక్తి మహేంద్ర మా కళ్ల ఎదుటే లోపల ఇరుక్కుపోయి బయటకు రాలేకపోయాడు. బస్సులో నుంచి మంటలు ఎక్కువై కళ్లముందే మనుషులు సజీవదహనం అవుతుంటే ఏ సాయం చేయలేక ఆ ప్రమాదాన్ని చూస్తూ ఉండలేక అల్లాడిపోయాం. ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు.
– కుమ్మరికుంట అబ్రహం, వెలిగండ్ల మండలం చౌడవరం
చచ్చిపోతామనుకున్నాం..
పామూరుకు రిజర్వేషన్ చేసుకొని వస్తున్నా. తెల్లవారుజామున పెద్ద మంటలు, దట్టమైన పొగ రావడంతో ఒక్కసారిగా అందరూ భయపడి పెద్దగా అరుచుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. చనిపోతామని అనుకున్నాం. బస్సు లారీని ఒక్కసారిగా ఢీకొనడంతో నా తల పైన టాపు తగిలి చీలింది. 6 కుట్లు పడ్డాయి. మమ్మల్ని అంబులెన్స్లో ఒంగోలు రిమ్స్కు తరలించారు.
– మైలారి చిట్టిబాబు, శంకరాపురం, పీసీపల్లి మండలం


