నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం
కలెక్టర్ పి.రాజాబాబు
ఒంగోలు సబర్బన్: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అందించడానికి కలెక్టర్ పి.రాజా బాబు నేతృత్వంలో ప్రఖ్యాతిగాంచిన సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రతినిధులతో శుక్రవారం ప్రకాశం భవనంలో సమావేశం నిర్వహించారు. మైనింగ్, పోర్టులు, హార్టీకల్చర్, ఆక్వా కల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, హైడ్రోకార్బన్ తదితర రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి వీటికి పరిశ్రమలను అనుసంధానం వలన జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని ఉద్యోగాలు పొందడంలో దోహదపడుతుందని కలెక్టర్ చెప్పారు. అందులో భాగంగా త్వరితగతిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. కార్యక్రమంలో సెంచూరియన్ యూనివర్సిటీ ప్రతినిధి జేఎన్ రావు, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రవితేజ, డీఆర్డీఏ పీడీ నారాయణ, జెడ్పీ సీఈవో చిరంజీవి, జిల్లాలోని పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీల ప్రిన్సిపాళ్లు, జిల్లా ఉపాధి అధికారి రమాదేవి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.


