వన్యప్రాణులను చంపితే జైలుకే
● అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రవూఫ్
మార్కాపురం: వన్యప్రాణులను చంపితే జైలుకు పంపుతామని మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రవూఫ్ హెచ్చరించారు. మార్కాపురంలోని తన కార్యాలయంలో బుధవారం ట్రాన్స్పోర్టు అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రెస్మీట్లో మాట్లాడారు. అడవిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో, వన్యప్రాణులు తిరిగే రెవెన్యూ కొండలు, తిప్పలు, పొదలు తదితర గ్రామాల్లో రైతులు పొలాల్లో విద్యుత్ వైర్లు పెట్టడం, ఉచ్చులు వేయడం చట్టవిరుద్ధమన్నారు. అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని చెప్పారు. విద్యుత్ శాఖ సిబ్బంది అలాంటి వాటిని తమ అటవీశాఖ సిబ్బందితో కలిసి గుర్తించాలని తెలిపారు. వారిపై వన్యప్రాణుల చట్ట ప్రకారం నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని చెప్పారు. వన్యప్రాణులను స్వేచ్ఛగా తిరగనివ్వాలని విజ్ఞప్తి చేశారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దోర్నాల సబ్ డీఎఫ్ఓ నీరజ్ హాన్స్, మార్కాపురం, దోర్నాల, యర్రగొండపాలెం, విజయపురి సౌత్, గంజివారిపల్లి ఎఫ్ఆర్ఓలు పిచ్చిరెడ్డి, హరి, ప్రసన్న జ్యోతి, సుజాత, సూర్య నారాయణ, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు నాగరాజు, ప్రసాదరెడ్డి, శివశంకర్, ఇమ్రాన్ సిద్ధిఖీ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: శాంతి భద్రతల పరిరక్షించడం, నేరాలను అరికట్టడం, కేసుల దర్యాప్తులో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్పీ హర్షవర్థన్ రాజు అన్నారు. తాలుకా పోలీసు స్టేషన్ పరిధిలో నేరాల కట్టడికి క్విజ్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ ఎన్ సూర్య కళ్యాణ చక్రవర్తి 50 సీసీ కెమెరాలను బుధవారం ఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో జిల్లా పోలీసు శాఖకు సీసీ కెమెరాలు అందించిన సూర్య కళ్యాణ చక్రవర్తిని అభినందించారు. పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్, ఈవ్టీజింగ్, రహదారి ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలు, ఇతర నేరాలకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాల్లో పెళ్లూరు నుంచి మంగమూరు వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఒంగోలు టౌన్: శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ఎలాంటి చర్యలకు పాల్పడినా ఉపేక్షించేదిలేదని, హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్థన్ రాజు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 388 మంది రౌడీ షీటర్లకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలోని పోలీసుస్టేషన్లకు పిలిపించి రౌడీలకు క్లాస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్ల ఫోన్లను ట్రాక్ చేస్తూ ఎప్పటికప్పుడు వారి కార్యకలాపాలను గమనిస్తున్నామని తెలిపారు. పద్ధతి మార్చుకొని మంచిగా ఉండాలని హితవు పలికారు. దౌర్జన్యాలు, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రోజూ రౌడీ షీటర్ల ఇంటికి వెళ్లి పోలీసు సిబ్బంది ఆరా తీస్తున్నారని, ఒకవేళ ఇంట్లో లేకుంటే మరుసటి రోజు ఉదయాన్నే పోలీస్స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు వివరించారు. సానుకూల ఆలోనలతో వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలని సూచించారు. యువత భవితను చెడగొట్టే అలవాట్లను విడిచిపెట్టి మంచిమార్గంలో సాగాలని, చెడు నడత కలిగిన వ్యక్తులు నేర ప్రవృత్తిని విడనాడి సద్బుద్ధితో జీవించాలని చెప్పారు. గతంలో జరిగిన పరిణామాలను మరచిపోవాలని, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలు వంటి సమాజానికి హానీ చేస్తాయని, దురలవాట్ల నుంచి దూరంగా ఉండాలని చెప్పారు. పోలీసులు చేపట్టే ప్రజాహిత కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎలాంటి గొడవలు, అల్లర్లకు పాల్పడకుండా మసలుకోవాలని చెప్పారు. దర్శి డీఎస్పీ లక్ష్మీ నారాయణ, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐలు, ఎస్సైలు ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
వన్యప్రాణులను చంపితే జైలుకే


