హాస్టల్ విద్యార్థులను వైద్యులు ప్రతి నెలా పరీక్షించాలి
● డీఆర్ఓ ఓబులేసు
ఒంగోలు వన్టౌన్: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను ప్రతి నెలా వైద్యులు పరీక్షించాలని డీఆర్ఓ ఓబులేసు సూచించారు. ఒంగోలు అన్నవరప్పాడులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం–7ను శనివారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా వంట గది, తాగునీరు, మరుగుదొడ్లు, స్టోర్ గదిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..లేదా, ప్రతి నెలా వైద్యులు వస్తున్నారా లేదా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వసతులు బాగున్నాయని విద్యార్థులు ఆయనతో చెప్పారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. చివరిగా విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. డీఆర్ఓ మాట్లాడుతూ విద్యార్థులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించరాదని వసతి గృహం సిబ్బందికి సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసినట్లు చెప్పారు. వసతి గృహంలో మొత్తం 95 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఆయనతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.లక్ష్మానాయక్, సహాయ సంక్షేమ అధికారి టి.లింగయ్య, వసతి గృహ సంక్షేమ అధికారి అంకబాబు, సిబ్బంది పాల్గొన్నారు.


