అబద్ధాల మేళం..!
జిల్లాలో తుస్సుమన్న రైతన్నా మీ కోసం కార్యక్రమం ప్రచార ఆర్భాటం మినహా రైతుకు ఒరిగిందేమీలేదని విమర్శలు పలు నియోజకవర్గాల్లో రైతుల నుంచి నిరసనలు సమాధానం చెప్పలేక బిక్కముఖం వేసిన అధికారులు చంద్రబాబు ప్రసంగం చదివి వినిపించి మమ అనిపించిన యంత్రాంగం పలు నియోజవర్గాల్లో దూరంగా అధికార పార్టీ నేతలు
రైతన్నా మీ కోసం..
మా ఊళ్లో సమావేశం ఎప్పుడు జరిగిందో మాకు తెలియదు
మా గ్రామంలో రైతన్నకు మీ కోసం సమావేశం ఎప్పుడు జరిగిందో మాకు తెలియనే తెలియదు. నేను నాలుగు ఎకరాల్లో మినుము, అలసంద సాగు చేశా. ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా నీటమునిగి పంట దెబ్బతింది. సబ్సిడీపై విత్తనాలు ఇవ్వలేదు. బయట మార్కెట్లో కొని సాగుచేసుకుంటున్నా. చంద్రబాబు ఏటా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ ఇస్తామని చెప్పారు. తొలి ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది రెండు దఫాలుగా సగమే వేశారు. ఆర్బీకేల ద్వారా సబ్సిడీ విత్తనాలు ఇవ్వలేదు. పంట నష్టపరిహారం ఇవ్వలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా రైతు భరోసా కేంద్రం ద్వారా అన్నీ ఇచ్చారు. చంద్రబాబు పాలనలో రైతులను మోసం చేస్తున్నారు.
– దారా నాగయ్య, వెంగపల్లి , హనుమంతునిపాడు మండలం
ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో అన్ని రకాలుగా రైతును ముంచేసింది. చంద్రబాబు ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంగా ఉండడంతో అధికారులు తూతూమంత్రంగా నిర్వహించి కార్యక్రమాన్ని మ..మ అనిపించారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
జిల్లాలో మొత్తం 5,31,369 మంది రైతులున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్, రబీ సీజన్లలో వివిధ రకాల పంటలు సాగుచేసిన రైతులు లాభారు ఆర్జించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతల పరిస్థితి తలకిందులైంది. మొదటి సంవత్సరం పాలనలో రెండు సార్లు ఖరీఫ్లోనూ, రబీలోనూ కరువు కరాళనృత్యం చేసింది. దాంతో ఒకసారి 17 మండలాలు, రెండోసారి 30 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. దాంతో పంటలు నష్టపోయిన రైతుల జాబితాలు సిద్ధం చేసి నష్టం అంచనాలను ప్రభుత్వానికి పంపారు. కానీ ఇంతవరకు పంట నష్టం రైతుకు చేరింది లేదు. గత సంవత్సరం దాదాపు రూ.100 కోట్లకుపైగా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉన్నా ఇంత వరకు ఇవ్వలేదు. పంటల బీమా లేదు. యాంత్రీకరణ లేదు. ఇలా చెప్పుకుంటూపోతే రైతన్న కంట కన్నీళ్లు ఒలుకుతాయి. సబ్సిడీ విత్తనాలు లేవు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతన్నలు అప్పుల బాధతో విలవిల్లాడుతున్నారు. పొగాకు రైతులు పూర్తిగా పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారు. బ్లాక్ బర్లీ పొగాకు తూతూమంత్రంగా కొనుగోలు చేసి పొగాకు రైతులను నిలువునా ముంచారు. ఇక, సజ్జ, మొక్కజొన్న, మిర్చి, పత్తి, వరి, జొన్న, కందులు, మినుములు ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కలేదు. ప్రభుత్వం ముందుకొచ్చి కొనుగోలు చేయనూ లేదు. ఇంతటి దీనావస్థలో రైతులు కొట్టుమిట్టాడుతుంటే రైతన్నా మీ కోసం ఏమి ఒరగబెట్టడానికి చేపట్టారన్న విమర్శలు చంద్రబాబు ప్రభుత్వంపై పెల్లుబుకుతున్నాయి.
మోంథా తుఫాన్తో జిల్లాలో పత్తి 35,750 ఎకరాలు, సజ్జ 7,300, వరి 9,500, మొక్కజొన్న 7,100, ఇతర పంటలు 36 వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. తుఫాన్ వచ్చి నెలరోజులవుతున్నా ప్రభుత్వం నేటికీ పరిహారం అందజేసిన దాఖలాలు లేవు. గత ఏడాది ఫెంగల్ తుఫాన్ జిల్లాలోని పది మండలాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. 7650 మంది రైతులు 25540 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకూ సాయం అందలేదని రైతులు వాపోతున్నారు. ఇక, అన్నదాత సుఖీభవకు ప్రభుత్వం కోతలు పెట్టింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఈ పథకాన్ని ఎగ్గొట్టి రైతులకు పంగనామాలు పెట్టారు. రెండో ఏడాదిలోనూ జిల్లాలో 15,970 మంది రైతులకు మొండిచేయి చూపారు. వైఎస్సార్ రైతు భరోసా 2,84,113 మందికి వర్తిస్తే నేడు 2,68,163 మంది అర్హులుగా గుర్తించారు. మరోవైపు దాదాపు 45 వేల మంది కౌలు రైతులకు నయాపైసా కూడా ఇవ్వకుండా వారికి వేదన మిగిల్చారు. రైతులకు ఎంతో ఉపయోగకరమైన 616 రైతు భరోసా కేంద్రాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
మొక్కుబడి సమావేశాలు మినహా నష్టపరిహారమేదీ
పది ఎకరాల్లో పత్తి సాగు చేశా. సుమారు రూ.3 లక్షల వరకూ ఖర్చు చేశా. మోంథా తుఫాన్తో కురిసిన భారీ వర్షాలకు పంట మొత్తం నష్టపోయా. నాణ్యత తగ్గి దిగుబడి లేక పొలాల్లో పీకిన పత్తిని కొనేవారులేక ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంలేదు. వ్యవసాయ సిబ్బంది మాత్రం గ్రామాల్లో రైతుల కోసమంటూ సమావేశాలు పెడుతున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా మొక్కుబడి సమావేశాలు ఎందుకో తెలియడం లేదు. పరిహారం ఇస్తేనే మేము కోలుకుంటాం.
– నర్రావుల బసవారెడ్డి, పత్తి రైతు, వెలిగండ్ల, కొనకనమిట్ల మండలం
అబద్ధాల మేళం..!
అబద్ధాల మేళం..!
అబద్ధాల మేళం..!


