ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి
ఒంగోలు సబర్బన్: జిల్లాకు మొంథా తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రానున్న మూడు రోజులు జిల్లాలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, మొంథా తుఫాన్ జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్ ఆదేశించారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ పీ రాజాబాబుతో కలిసి ఒంగోలు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆదివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాఖల వారీగా చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తుఫాన్ ముప్పు నేపథ్యంలో రానున్న మూడు రోజులు (27, 28, 29 తేదీలు) జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి తుఫాన్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు.
అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో శశిధర్ మాట్లాడుతూ తుఫాన్ ముప్పును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందన్నారు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు ప్రకాశం జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేయడానికి తాను ఒంగోలు వచ్చినట్లు తెలిపారు. ముందస్తు ఏర్పాట్లు, జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో కలిసి ఆల్ కీ డిపార్ట్మెంట్స్ అధికారులతో సమీక్షించినట్లు చెప్పారు. తుఫాన్ 28వ తేదీ రాత్రి మచిలీపట్నం – కాకినాడ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసిందని తెలిపారు. మత్స్యకారులు ఎవరైనా చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారా లేదా అని సమీక్షించుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో ఎవరూ సముద్రంలోకి వెళ్లలేదని, అందరు సురక్షితంగా ఉన్నారని అధికారులు చెప్పినట్లు తెలిపారు. తుఫాన్ ప్రభావం తగ్గేంత వరకు, అధికారులు చెప్పేంత వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లరాదని సూచించారు. సముద్ర తీరప్రాంత మండలాల్లోని 18 గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే ఆయా ప్రాంతాలలోని వృద్ధులు, గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు.
అధికారులతో సమీక్షిస్తున్న కోన శశిధర్, పక్కన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్
సమీక్షకు హాజరైన జిల్లా అధికారులు
తుఫాన్పై అప్రమత్తంగా ఉండండి
జిల్లా అధికారులతో సమీక్షించిన తుఫాన్ జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్, కలెక్టర్ రాజాబాబు
జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్ల పరిస్థితిపై సమీక్ష...
జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్ల పరిస్థితిపై సమీక్షించుకోవడం జరిగిందని, ఎక్కడైతే ఓవర్ ఫ్లో అవుతున్నాయో ఆయా ట్యాంకులు, చెరువులపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కలెక్టర్ ఆదేశాలతో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు శశిధర్ తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖ, మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖ, ఇరిగేషన్, వైద్యారోగ్య శాఖ, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ, విద్య, తదితర ముఖ్యమైన శాఖల అధికారులతో సమగ్రంగా సమీక్షించి తగు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. సంబంధిత శాఖల సిబ్బందితో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ గంటగంటకూ సమాచారం తీసుకుంటూ ఏదైనా సంఘటన జరిగితే తక్షణమే స్పందించేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లా యంత్రాంగం మొంథా తుఫాన్ను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉందని శశిధర్ తెలిపారు. తొలుత తుఫాన్కు ముందు, తుఫాన్ సమయంలో, తుఫాన్ తర్వాత శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై రూపొందించిన యాక్షన్ ప్లాన్ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ పీ రాజాబాబు ప్రత్యేక అధికారికి సమగ్రంగా వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి


