రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్లో జిల్లా వాసుల ప్రతిభ
ఒంగోలు సిటీ: ‘కళాఉత్సవం 2025’ ను పురస్కరించుకొని విజయవాడలో ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు ఐదు విభాగాల్లో పాల్గొని బహుమతులు సాధించారని మైనంపాడు డైట్ ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు శనివారం తెలిపారు. ఫోక్డాన్స్ లో మూడో బహుమతిని సీఎస్పురం కేజీబీవీకి చెందిన పూజ గ్రూప్, సోలో ఓకల్లో రెండో బహుమతిని ఎన్.లక్ష్మీలాస్య సాయి, గ్రూప్ ఓకల్లో మూడో బహుమతిని జి.ఝాన్సీ గ్రూప్, థియేటర్ ఆర్ట్లో మూడో బహుమతిని కే కావ్య గ్రూప్, విజువల్ ఆర్ట్ టూడీలో రెండో బహుమతిని జీ శృతి గెలుచుకున్నారని తెలిపారు. విజేతలను అభినందించారు.
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లో 2023–2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగో సెమిస్టర్ ఫలితాలను వైస్ఛాన్సలర్ డీవీఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పీజీ కళాశాలల్లోని వివిధ కోర్సులకు సంబంధించి మొత్తం 1011 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 92.58 ఉత్తీర్ణత శాతంతో 936 మంది పాసైనట్లు తెలిపారు. ఏకేయూ స్థాయిలోని ఆయా కళాశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీఈ ప్రొఫెసర్ సోమశేఖర, డాక్టర్ ఆర్.శ్రీనివాసులు, సూడా శివరాం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా వైఎస్సార్ సీపీ నేత, మార్కాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు దేవతి భగవన్నారాయణ నియామకపత్రం పంపించారు. ఆమేరకు నియామకపత్రం శనివారం అందినట్లు బాలమురళీకృష్ణ తెలిపారు. ఆర్యవైశ్య అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా బాల మురళీకృష్ణను పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, ఆర్యవైశ్య సభ్యులు పలువురు అభినందించారు.
మద్దిపాడు: మండలంలోని కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ జలాశయం నుంచి డ్యాం అధికారులు భారీగా నీరు విడుదల చేస్తున్నారు. గుండ్లకమ్మ నదిపై భాగంలో భారీగా వర్షాలు కురిసి వాగులు నదిలో కలుస్తుండటంతో వరద నీరు రిజర్వాయర్లోకి చేరుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి 24 వేల క్యూసెక్కుల నీరు రిజర్వాయర్ లోకి రావడంతో 9 గేట్లు ఎత్తి 24 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేశారు. రాత్రికి వరద నీరు భారీగా రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుండ్లకమ్మ నది దిగువ భాగంలో గ్రామాల్లో నివసించే ప్రజలు గుండ్లకమ్మ నది లోకి దిగరాదని ప్రజలను హెచ్చరించారు. డ్యామ్ అధికారులు గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద అప్రమత్తంగా ఉన్నట్లు ఏఈ రామాంజనేయులు తెలిపారు.
పెద్దదోర్నాల: నల్లమలలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండల పరిధిలోని తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహించటంతో చిన్నదోర్నాల వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో తీగలేరు పొంగటంతో మార్కాపురం, ఒంగోలు కడప, గిద్దలూరుతో పాటు శ్రీశైలం, కర్నూల్తో పాటు రాయలసీమ వైపునకు వెళ్లే వాహనాలను కుంట మీదుగా దారి మళ్లించారు. వర్షాలు కురుస్తున్న ప్రతి సారీ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతుండటంతో వాహనాదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్లో జిల్లా వాసుల ప్రతిభ


