
బినామీల కోసమే ప్రైవేటీకరణ
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చంద్రబాబు దుర్బుద్ధే కారణం ఆయన స్వార్థానికి పేదలకు విద్య, వైద్యం దూరం పేద విద్యార్థులకు తీరని అన్యాయం కనీస అవసరాలు తీర్చలేని సీఎం ఎందుకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ధ్వజం పేదలకు విద్య, వైద్యం జగనన్నకే సాధ్యమని స్పష్టం దర్శి నగర పంచాయతీలోని కొత్తరెడ్డిపాలెంలో కోటి సంతకాల సేకరణ
దర్శి: పేద ప్రజలకు విద్య, వైద్యం అందించడం మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దర్శి నగర పంచాయతీ పరిధిలోని కొత్తరెడ్డిపాలెం రచ్చబండ వద్ద గురువారం కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ ఆవుల జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముందుగా సంతకాలు చేసి కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారన్నారు. వాటిని కొనసాగిస్తే జగనన్నకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే దుర్బుద్ధితో పాటు తన బినామీల కోసం ప్రభుత్వ, ప్రైవేట్, పార్టనర్షిప్ (పీపీపీ) పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటుపరం చేసి పేదల నోట్లో మట్టి కొట్టి చరిత్రహీనుడిగా సీఎం చంద్రబాబు మిగిలిపోయారన్నారు.
పేదలకు ఉచిత వైద్యం,
వైద్య విద్య ఎలా అందుతాయి..?
వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలల్లో ఐదు అందుబాటులోకి వచ్చి తరగతులు, వైద్య సేవలు అందిస్తుండగా, మరో 12 కళాశాలలు నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయని బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు వాటిని ప్రైవేటీకరిస్తే పేద విద్యార్థులకు మెడికల్ కళాశాలల్లో ఉచిత వైద్య విద్య, పేద రోగులకు ఉచిత వైద్యం ఎలా అందుతాయని ప్రశ్నించారు. జిల్లాలోని మార్కాపురం మెడికల్ కళాశాల పనులు 70 శాతం పూర్తయ్యాయని, ఎంతో నాణ్యతతో నిర్మాణాలు కూడా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేపట్టారని చెప్పారు. పశ్చిమ ప్రాంత ప్రజలు తమకు మెడికల్ కళాశాల వచ్చిందని ఎంతో సంతోషించారని తెలిపారు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారన్నారు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒంగోలులో నిర్మించిన రిమ్స్, జీజీహెచ్లో నేటికీ వేలాది మంది ఉచిత వైద్యం చేయించుకుంటున్నారని గుర్తుచేశారు. కోవిడ్ హయాంలో ఎంతో మంది బాధితులకు పైసా ఖర్చు లేకుండా కాపాడారన్నారు. జగనన్న ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తూ పేద ప్రజలను జలగల్లా పీక్కుతినేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో అమరావతి అభివృద్ధి పేరుతో ఇప్పటికే రెండు లక్షల కోట్లకుపైగా అప్పు తెచ్చిన చంద్రబాబు.. మెడికల్ కళాశాలల నిర్వహణకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా..? అని ప్రశ్నించారు. ఇదేనా పేదలపై మీకున్న చిత్తశుద్ధి అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కనీస అవసరాలు తీర్చలేని సీఎం ఆ పదవికి అర్హుడేనా అని ప్రశ్నించారు. దీనికి నిరసనగా దర్శి నియోజకవర్గంలో 60 వేలకుపైగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 28న భారీ ర్యాలీ నిర్వహించి రెవెన్యూ కార్యాలయంలో, నవంబర్ 12న కలెక్టర్ కార్యాలయంలో అర్జీలివ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అందరూ కలిసికట్టుగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని బూచేపల్లి పిలుపునిచ్చారు.
చరిత్రహీనుడిగా చంద్రబాబు...
జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ పేదలకు ఆరోగ్య శ్రీ, 108, 104, అమ్మ ఒడి, ఉచిత విద్య, వైద్యం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలలో అమలు చేశారని వివరించారు. కరోనాను సైతం ఆరోగ్య శ్రీలో చేర్చి పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని జగన్మోహన్రెడ్డి అందించారన్నారు. నేడు చంద్రబాబు హయాంలో ఆరోగ్య శ్రీ కూడా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను తన స్వార్థం కోసం చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నిర్ణయం వెంటనే వెనక్కు తీసుకోకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగాా మిగిలిపోతాడని హెచ్చరించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మలను దుశ్శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అధిక సంఖ్యతో ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు హాజరై మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డు రామారావు, మండల కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, యన్నాబత్తిన సుబ్బయ్య, కాకర్ల కృష్ణారెడ్డి, తూము వెంకటసుబ్బారెడ్డి, ఎంపీపీ బొరిగొర్ల ఉషామురళి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడికొండ జయంతి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి, జెడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సైదా, క్రిస్టియన్సెల్ రాష్ట్ర కార్యదర్శి గుంటు పోలయ్య, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కొల్లా ఉదయభాస్కర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, కేసరి రాంభూపాల్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రెడ్డి, ఎంపీటీసీల సంఘ అధ్యక్షుడు బండి గోపాల్రెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, కౌన్సిలర్లు మేడం మోహన్రెడ్డి, తుళ్లూరి బాబూరావు, మాజీ ఎంపీపీలు గోళ్లపాటి మోషె, ఇత్తడి దేవదానం, క్రిస్టియన్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు కృపానందం, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు గల్లెపోగు ఏసుదాసు, విద్యార్థి విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, నాయకులు కోరే సుబ్బారావు, షేక్ షకీలా అమీన్ బాషా, మేడగం బాలకృష్ణారెడ్డి, ఆవుల శివారెడ్డి, ఊట్ల వెంకటేశ్వర్లు, కేసనపల్లి నాగేశ్వరరావు, అన్నవరపు రవి, చెరుకూరి జగన్, నుసుం ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బినామీల కోసమే ప్రైవేటీకరణ

బినామీల కోసమే ప్రైవేటీకరణ