
ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనకు బుద్ధి చెప్పాలి
మెడికల్ కళాశాలల ప్రైవేటు పరంతో పేదలకు వైద్యం దూరం టీడీపీ పెద్దల బినామీలకు కట్టబెట్టేందుకు కుట్ర వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేపీ నాగార్జునరెడ్డి కంభంలో వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ
బేస్తవారిపేట: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరంచేసే ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనకు ప్రజలే బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. కంభంలోని వైజంక్షన్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కేపీ నాగార్జునరెడ్డితో కలిసి ప్రారంభించారు. ముందుగా కందులాపురం సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో ర్యాలీగా వైజంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభ వద్దకు చేరారు. పీపీపీ పేరుతో ప్రజలకు వైద్యం అందుబాటులోకి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. టీడీపీ పెద్దలు వారి అనుచరులకు, బినామీలకు మెడికల్ కాలేజీలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేసిందని విమర్శించారు. నేడు వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని వివరించారు. విద్య, వైద్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్రలు చేసి వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులను అక్రమ అరెస్ట్లు చేయడంపై దృష్టి పెట్టిందన్నారు. అధికారంలోకి వచ్చిన మరుసటిరోజు నుంచే నకిలీ మద్యం తయారు కేంద్రాలను ఏర్పాటు చేసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ పాలనలో 43 వేల బెల్ట్షాపులను తొలగిస్తే నేడు ఇంటింటికీ మద్యం సరఫరా జరుగుతోందన్నారు. 1923 నుంచి 2019 వరకు ఏపీలో 12 మెడికల్ కళాశాలలు ఉన్నాయని, 2300 మంది డాక్టర్లుగా చదువుకునేవారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత కరోనా సమయం రెండున్నరేళ్లు పోగా దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకుకొచ్చిందన్నారు. ఒక్కొక్క కళాశాలకు 50 ఎకరాలు స్థలం కేటాయించారని, ఐదు కళాశాలలను పూర్తి చేసి ప్రారంభించారని చెప్పారు. ఎన్నికల సమయంలో మరో రెండు కళాశాలల పనులు పూర్తయ్యాయన్నారు. ఇంకో ఆరు కాలేజీలు 80 శాతం, మూడు కాలేజీలు 40 పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు పెడితే అన్నీ కళాశాలలు పూర్తయి ఏడాదికి 2550 మంది డాక్టర్లుగా చదువుకుని బయటకు వస్తారన్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రజలకు వైద్యసేవలు గ్రామీణ ప్రాంతాలకు చేరువ అవుతాయన్నారు. మార్కాపురంలో మెడికల్ కాలేజీ పూర్తి కావడంతో వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో అధునాతనమైన ఉచిత వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
చంద్రబాబు పాలన అంతా ఆర్భాటం..
చంద్రబాబు 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన సమయంలో ఏనాడూ పేద ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. సూపర్సిక్స్తోపాటు 200 హామీలు ఇచ్చిన చంద్రబాబు కేవలం 2–3 పథకాలు అరకొరగా అమలు చేశారన్నారు. కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు తనకు తానేసాటి అని మరొక్కసారి నిరూపించుకున్నాడని విమర్శించారు. ఒక్క మెడికల్ కళాశాల ఏర్పాటైతే 1500 పడకలు, స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ పరిశీలకులు కేవీ రమణారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, ఎంపీపీలు వేగినాటి ఓసూరారెడ్డి, చేగిరెడ్డి తులశమ్మ, ఎం వెంకట్రావ్, జెడ్పీటీసీలు బీవీ రాజయ్య, వెంకటనాయుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు నెమిలిదిన్నె చెన్నారెడ్డి, అబ్దుల్ గఫార్ఖాన్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు గొంగటి చెన్నారెడ్డి, ఆవుల శ్రీధర్రెడ్డి, యేరువ రంగారెడ్డి, ఎం రవికుమార్, మాజీ ఎంపీపీలు రవికుమార్యాదవ్, వెంకటరాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనకు బుద్ధి చెప్పాలి