
ముగిసిన అంతరిక్ష వారోత్సవాలు
ప్రాజెక్టులు పరిశీలిస్తున్న విద్యార్థులు
బహుమతులు అందజేస్తున్న దృశ్యం
● రెండో రోజు స్పేస్ ఎగ్జిబిషన్కి
విశేష స్పందన
ఒంగోలు సిటీ: సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, ఇస్రో, క్విస్ ఇంజినీరింగ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన అంతరిక్ష వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షార్ చీఫ్ జనరల్ మేనేజర్ పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇస్రోలో చేసిన వివిధ ప్రయోగాల గురించి వివరించారు. రానున్న కాలంలో మరిన్ని ప్రయోగాలు చేస్తామన్నారు. గగన్యాన్ తదితర ప్రాజెక్టుల గురించి విద్యార్థులకు వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రభుత్వం సైన్సు రంగంలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టనుందన్నారు. భారతీయ అంతరిక్ష స్టేషన్ను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది లివ్ ఇన్ స్పేస్ కాన్సెప్ట్తో అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రజల్లో, విద్యార్థుల్లో సైన్సు గురించి అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వారోత్సవాలకు ఏర్పాటు చేసిన క్విస్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నిడమానూరి సూర్య కల్యాణ్ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ నిడమానూరి గాయత్రి దేవిలకు కృతజ్ఞతలు తెలిపారు.
3 వేల మంది విద్యార్థుల సందర్శన
అంతరిక్ష వారోత్సవాలకు వివిధ పాఠశాలలు, కాలేజీలకు చెందిన విద్యార్థులు 3 వేల మంది హాజరయ్యారు. స్పేస్ ఎగ్జిబిషన్, ప్రాజెక్ట్ ఎక్స్పోని తిలకించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎక్స్ పో, పెయింటింగ్ పోటీలు, క్విజ్, పోస్టర్ ప్రజంటేషన్ తదితర పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. క్విస్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైవీ హనుమంతరావు, డీపీఎస్ ఆర్ డైరెక్టర్ డాక్టర్ బీవీ సుబ్బారావు, వరల్ట్ స్పేస్ వీక్ – 2025 ఒంగోల్ సబ్ కమిటీ ఛైర్మన్ లీలా నాగ శ్రీనివాసరావు, మెంబర్ సెక్రటరీ ఆదిత్య, ఇస్రో అధికారులు రామాంజనేయులు, అప్పారావు, శివ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన అంతరిక్ష వారోత్సవాలు