
కేపీఐపై నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి
ఒంగోలు సబర్బన్: ప్రభుత్వం నిర్దేశించిన కేపీఐ (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)పై జిల్లా స్థాయి అధికారులు నిరంతరం సమగ్రంగా పర్యవేక్షణ ఉంచాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఆయా అంశాల్లో పురోగతిని తాను కూడా ప్రతివారం సమీక్షిస్తానని చెప్పారు. కేపీఐ లక్ష్యాలు–పురోగతిపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం ప్రకాశం భవనంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 కోసం ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలను గుర్తించి వీటిలో పురోగతి కోసం కేపీఐలను ప్రభుత్వం ఎంచుకున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే వీటి కోసం లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించిందని కలెక్టర్ తెలిపారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖల ఉన్నతాధికారులకు వీటిని తెలియజేస్తారని, అనంతరం అక్కడ నుంచి జిల్లాలోని ఉన్నతాధికారులకు శాఖల వారీగా ఇవి వస్తాయని, వీటిని మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆయా లక్ష్యాలను కాలానుగుణంగా (పీరియాడికల్) చేరుకునేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేలా చూడాలని చెప్పారు. మండల స్థాయి అధికారులు చేస్తున్న పనులు, సాధిస్తున్న పురోగతిపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆన్లైన్లో రియల్ టైంలో ఈ వివరాలు కనిపిస్తూ ఉంటాయన్నారు.
ఫైళ్లు సైతం
పరిపాలనలో సాంకేతిక వినియోగానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం, ఇందులో భాగంగా శాఖల వారీగా ఆయా కార్యాలయాలకు సంబంధించిన జీవోలు, సర్క్యులర్లు, ఇతర కీలక ఫైళ్లను కూడా ఆన్లైన్లో పొందుపరిచేలా చర్యలు చేపట్టిందని కలెక్టర్ చెప్పారు. వీటిని ఈపీటీఎస్.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైటులో అప్లోడ్ చేయాలని అన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ, డీఆర్ఓ బి.చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా