
ఇంత బరితెగింపా..!
కురిచేడు:
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన అధికారులే భక్షకులుగా మారుతున్నారు. ప్రభుత్వ భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారులే అక్రమాలకు తెరలేపారు. దీంతో ఎన్నో ఏళ్ల నాటి ప్రభుత్వ భూములు రాత్రికి రాత్రే ప్రైవేట్పరం అయిపోతున్నాయి. స్థానిక రెవెన్యూ కార్యాలయంలోని అధికారుల లీలలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. కూటమి నాయకుల అండదండలతో అడ్డగోలుగా ప్రభుత్వ భూములకు ఆన్లైన్ చేసి దండుకుంటున్నారు. ఒక వైపు ఉన్నతాధికారులు ప్రభుత్వ భూములపై విచారణ జరిపేందుకు ఆదేశాలు ఇచ్చినా, కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్నా వాటిని పట్టించుకోకుండా ఆన్లైన్ చేయడం విశేషం.
ప్రభుత్వభూమి ఆన్లైన్..
మండలంలోని కల్లూరు గ్రామ సర్వే నంబర్ 272/74 లోని ప్రభుత్వ భూమిని కొంతమంది పేర్లతో ఆన్లైన్ ఎక్కించినట్లు గ్రామ వైఎస్సార్ సీపీ నాయకుడు పాలెబోయిన పెద్ద పెద్దయ్య ఆధారాలతో సహా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారుల అవినీతి దాహంతో గ్రామంలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గ్రామస్తులు కలెక్టర్కు ఫిరా్య్దు చేసినా రెవెన్యూ అధికారులు బరితెగించి మాకు కూటమి నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయని బాహాటంగా చెప్పుకుంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే ఒక వ్యక్తి తన కుటుంబసభ్యుల పేరుపై సర్వే నంబఱ్ 272/1కే లోని 3 ఎకరాల భూమిని ఆన్లైన్ చేశారు. అలాగే 272/74 లోని ప్రభుత్వ భూమిని నక్కా ఆంజనేయులు పేరుతో 50 సెంట్లు ఆన్లైన్ చేశారు. అదే సర్వే నంబర్లోని మరో 50 సెంట్లు నక్కా లింగమ్మకు అనువంశికం కింద ఆన్లైన్ చేశారు. వల్లెం వెంకటేశ్వర్లు పేరుతో కూడి మరో 50 సెంట్ల భూమిని ఈ నెల 19వ తేదీ ఆన్లైన్ చేశారు. వాస్తవానికి ప్రభుత్వ రికార్డుల్లో ఈ భూమి గయాల్ అని ఉంది. గతంలో పనిచేసిన తహసీల్దార్ నాగుల్మీరా సైతం ప్రభుత్వ భూమి అని ఎండార్స్మెంట్ చేశారు. అలాగే సమాచార హక్కుచట్టం ద్వారా కూడా 272/1కే, 39 సర్వేనంబర్లు గయాలు భూమిగా సమాధానం ఇచ్చారు. అలాగే నక్కా లక్ష్మిదేవి పేరుపై ఉన్న మూడు ఎకరాల భూమిపై విచారణ చేయాలని డీఆర్ఓ ఓబులేశు గత మార్చి నెలలో విచారణకు ఆదేశించారు. ఈ భూములపై గ్రామస్తులు సైతం హైకోర్టులో కేసు వేశారు. ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నా, కోర్టుల్లో పెండింగ్ ఉన్నా అధికారులు అవేమీ మాకు సంబంధం లేదని అక్రమంగా ఆన్లైన్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే రెవెన్యూ అధికారుల లీలలు బయటకు వస్తాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
అడ్డగోలుగా ప్రభుత్వ భూముల ఆన్లైన్
నేతల అండదండలతో బరితెగిస్తున్న
అధికారులు, సిబ్బంది
ప్రభుత్వ భూమని తెలిసినా అక్రమంగా
ఆన్లైన్ చేసేస్తున్న వైనం
ఉన్నతాధికారుల ఆదేశాలూ బేఖాతరు.

ఇంత బరితెగింపా..!

ఇంత బరితెగింపా..!