జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం

Jun 1 2025 12:31 AM | Updated on Jun 1 2025 12:47 AM

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం

ఒంగోలు సిటీ:

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ పిలుపునిచ్చారు. ఆమె అధ్యక్షతన స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. గ్రామీణ నీటి సరఫరా, డ్వామా, డీఆర్‌డీఏ, విద్య, వ్యవసాయం, ఉద్యానవన శాఖల ద్వారా అందుతున్న సేవల గురించి వివరించారు. చట్టసభ సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ సూచించారు. ముందుగా పహల్గాం ఉగ్ర దాడిలో అమరులైన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.

బాధిత రైతుకు పరిహారం అందించాలి : యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌

యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని గురిజేపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు బొప్పాయి పంటను నష్టపరిచారని, బాధిత రైతుకు పరిహారం అందేలా చూడాలని అధికారులను కోరారు. యర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీ జాబితాలో 320 మంది పేర్లు లేవని, పరిశీలించి వాటిని చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు.

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రక్షిత మంచినీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు సక్రమంగా పనిచేసేలా పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రంలో జలజీవన్‌ మిషన్‌ పనులను పూర్తి చేసే గడువును 2028 వరకు పెంచినందున ఆయా పనులను వేగవంతం చేయాలని చెప్పారు. రైతుల వద్ద పొగాకు నిల్వలు భారీగా ఉన్నందున మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. కొత్త జెడ్పీ సమావేశ మందిరం నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గంలో ఫ్లోరైడ్‌ సమస్యకు తోడు సాగర్‌నీటిని పంపణీ చేసే పైపులైన్లు దెబ్బతిన్నందున కొత్త పైపులైన్లు వేయాల్సిన అవసరం ఉందన్నారు. అర్హులందరికీ పెన్షన్లు అందేలా చూడాలన్నారు. హనుమంతునిపాడు మండలంలో తక్కువ వర్షపాతం నమోదైనా కరువు మండలంగా ప్రకటించలేదని, పున:పరిశీలన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు చెప్పారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో సీపీడబ్ల్యూఎస్‌ పథకాల నిర్వహణపై మరింత దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. రామతీర్ధం, గుండ్లకమ్మ కాలువలను బాగుచేయించాలని సూచించారు. సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. జూన్‌ నెలాఖరుకు పూర్తిచేయకపోతే నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం ఉండదన్నారు.

పలు సమస్యలు ఏకరువు పెట్టిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు...

పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు అనేక సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. స్కూళ్లలో విద్యాహక్కు చట్టం పకడ్బందీగా అమలయ్యే విధంగా చూడాలని కోరారు. చీమకుర్తి బాలికల హాస్టల్లో భోజనం నాణ్యంగా లేదని, వర్కర్లు దారుణంగా మాట్లాడుతున్నారని, ఈ సమస్యపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో ఫ్లోరైడ్‌ నీటి సమస్యను పరిష్కరించాలని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసిన వారికి పెండింగ్‌ బిల్లులు చెల్లించేలా చూడాలని అధికారులను కోరారు. రామతీర్థం ప్రాజెక్టుకు వెళ్లే దారిలో ఉన్న ముళ్లచెట్లను తొలగించాలని, శ్మశానాలలో ముళ్లచెట్లను తొలగించి చుట్టూ ప్రహరీ నిర్మించాలని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మండలాల్లో ఆధార్‌ కేంద్రాల సంఖ్య పెంచాలని కోరారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి : జేసీ గోపాలకృష్ణ

జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యాహక్కుచట్టం అమలు, అర్హతలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీ జాబితాలో పేర్లు లేని వారి అర్హతను పరిశీలించేందుకు గ్రామసభలు పెట్టామన్నారు. అర్హులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జూన్‌ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొని యోగా సాధన చేయాలని పిలుపునిచ్చారు. కరోనా కేసులు పెరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి మాట్లాడుతూ స్టాండింగ్‌ కమిటీ సవరించిన మార్గదర్శకాల మేరకు, మండల పరిషత్‌ ఆమోదించే పనుల అంచనాల విలువను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు, జిల్లా పరిషత్‌ ఆమోదించే పనుల అంచనాల విలువను రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్రభుత్వం పెంచిందన్నారు. కొత్త జెడ్పీ సమావేశ మందిరం నిర్మాణానికి గతంలో రూపొందించిన రూ.20 కోట్ల అంచనాలను సవరించేందుకు గత రెండు స్టాండింగ్‌ కమిటీలలో ఆమోదించిన 350 ప్రతిపాదనలకు కూడా సమావేశంలో సభ్యులు ఆమోదం తెలిపారు. బాపట్ల, నెల్లూరు జిల్లాల డీఆర్వోలు గంగాధరగౌడ్‌, ఉదయభాస్కర్‌, జెడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశంలో పాల్గొన్నారు.

ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించడం లేదు : దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

జెడ్పీ సమావేశంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డులు కలిగిన వారందరికీ పని ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. ఉన్న జాబ్‌కార్డుల్లో యాభై శాతం మందికి కూడా పని కల్పించడం లేదన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాల వారికి పని కల్పించడం కోసమే ఉపాధి హామీ పథకం ఉందన్నారు. కానీ, అధికారులను అడిగినా పని కల్పించడం లేదన్నారు. కిందిస్థాయిలో ఇబ్బందిపెడుతున్నారని, అటువంటివి లేకుండా అందరికీ పని కల్పించాలని కోరారు. తన నియోజకవర్గంలో పంటలు నష్టపోయిన ఉద్యానవన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement