
భజే.. భజే.. భక్తాభీష్ఠా..
వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్దానం
సింగరాయకొండ:
పురాణ ప్రసిద్ధిగాంచిన, దక్షిణ సింహాచలంగా పేరొందిన పాతసింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శుక్రవారం అంకురార్పణతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు వైభవంగా నిర్వహించేందుకు దేవదాయశాఖ అధికారులు, పాలక మండలి ఏర్పాటు చేస్తోంది.
బ్రహ్మోత్సవాలు ఇలా..
వేద పండితుల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. శనివారం ఉదయం 10 గంటలకు ధ్వజారోహణ, రాత్రి 10 గంటలకు చంద్రప్రభ వాహనం, 8వ తేదీ ఉదయం 10 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 10 గంటలకు హంసవాహనం, 9వ తేదీ సోమవారం రాత్రి 10 గంటలకు శేషవాహనం, 10వ తేదీ రాత్రి 10 గంటలకు హనుమంత సేవ, 11వ తేదీ ఉదయం 10 గంటలకు మోహినీ ఉత్సవం, రాత్రి 11 గంటలకు గరుడ సేవ, 12వ తేదీ రాత్రి 9 గంటలకు వసంతోత్సవం, 10 గంటలకు గజోత్సవం, 13వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, సాయంత్రం 4 గంటలకు రథోత్సవం, 14వ తేదీ రాత్రి 10 గంటలకు గుర్రపు వాహనం, 15వ తేదీ ఉదయం 10 గంటలకు లక్ష్మీసంవాద ఉత్సవం, 11 గంటలకు చక్రస్నానం, రాత్రి 10 గంటలకు ధ్వజావరోహణ, పూర్ణాహుతి పూజలు, 16వ తేదీ సోమవారం రాత్రి 10 గంటలకు పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల సమయంలో రోజూ ఉదయం స్వామివారికి చప్పరసేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ పి.కృష్ణవేణి తెలిపారు.
సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాల సందర్భంగా 10వ తేదీ నుంచి సత్యహరిశ్చంద్ర, చండీమేళం, కోలాట ప్రదర్శన, 11వ తేదీన పాటకచేరి, 12వ తేదీన కూచిపూడి నాట్య ప్రదర్శన వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వీటితోపాటు శ్రీకృష్ణ యాదవ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో 9వ తేదీన పొట్టేళ్ల బలప్రదర్శన, 10వ తేదీన ఎడ్ల బండలాగుడు పోటీలు, 11వ తేదీన ఎడ్ల బండి రాధాడు పోటీలు నిర్వహించనున్నారు.
వరాహ లక్ష్మీనరసింహస్వామి
బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
11 రోజులపాటు సాగే ఉత్సవాలకు ముస్తాబైన ఆలయం
ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా పొట్టేలు పందేలు, ఎడ్ల పోటీలు
భక్తులను అలరించనున్న సాంస్కృతిక
కార్యక్రమాలు

భజే.. భజే.. భక్తాభీష్ఠా..

భజే.. భజే.. భక్తాభీష్ఠా..