
గిట్టుబాటు ధరలు లేకే రైతుల ఆత్మహత్యలు
● ఆత్మహత్య చేసుకున్న రైతుకు మాజీ మంత్రి సురేష్ నివాళులు
కొండపి: కూటమి ప్రభుత్వంలో పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. అప్పు చేసి పొగాకు పంట పండించి, గిట్టుబాటు ధర లేక గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకున్న నెన్నూరుపాడు గ్రామానికి చెందిన చల్లా మధుసూదన్ రెడ్డి మృతదేహానికి సురేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా ఒంగోలులోని రిమ్స్ లో పోస్ట్మార్టం నిమిత్తం తీసుకువెళ్లిన మృతదేహాన్ని మార్చురీలో పరిశీలించి కుటుంబ సభ్యులను అడిగి మృతికి కారణాలు, అప్పుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కొండపి మండలంలోని మృతుని స్వగ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని ధైర్యాన్ని, భరోసాను కల్పించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మధుసూదన్రెడ్డి పొగాకుతో పాటు పలు పంటలు సాగు చేయటంతో గిట్టుబాటు ధర లేక సుమారు రూ.10 లక్షల అప్పులయ్యాయని చెప్పారు. రాబోయే రోజుల్లో రైతుల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయని, ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని పొగాకుతో పాటు అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేయాలని హితవు పలికారు. ఆయన వెంట పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాకా పిచ్చిరెడ్డి, మండల కన్వీనర్ బచ్చల కోటేశ్వరరావు, జేసీఎస్ కన్వీనర్ గొట్టిపాటి మురళి, నియోజకవర్గ ఇంటలెక్చువల్ అధ్యక్షుడు భువనగిరి సత్యనారాయణ, కల్చరల్ వింగ్ అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, గ్రామ నాయకుడు మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, తదితర నాయకులు కార్యకర్తలు ఉన్నారు.