
పొగాకు రైతులను నమ్మించి మోసగించారు
పొదిలి రూరల్: ఈ ఏడాది పొగాకు సాగు చేసిన రైతులను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేయడమే గాక రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలోని పొదిలికి ఈ నెల 11న రానుండటంతో వైఎస్సార్ సీపీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్తో కలిసి శనివారం అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక, ఉన్న పొగాకును కొనే నాథుడే లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులు అప్పుల బాధలు తట్టుకోలేక అయోమయంలో పడ్డారన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతును రాజుగా చూసుకున్నారని చెప్పారు. పొగాకు, మిర్చి, వరి, పత్తి రైతులకు ఏకష్టం రాకుండా గిట్టుబాటు ధర కల్పించి రైతులకు న్యాయం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కక్షలు, కార్పణ్యాలతో ప్రజలను ఇబ్బందులు పెడుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తల మీద కేసులు పెడుతూ, పరిపాలన గాలికి వదిలేసిందన్నారు. తమ ప్రభుత్వంలో మిర్చి క్వింటా రూ.24 వేలు, వరికి గిట్టుబాటు ధర రూ.18 వేల నుంచి రూ.20 వేలు ఉంటే ఈ ప్రభుత్వంలో అడిగే నాథుడే లేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. పొగాకు కంపెనీల ప్రతినిధులు రైతులను ప్రోత్సహించి పంటలు సాగు చేయించి తీరా కొనుగోలు సమయంలో కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం ఉన్న సమయంలో పొగాకు క్వింటా రూ.32 వేలు, లోగ్రేడ్ రూ.24 వేలు ఉంటే ఈ ప్రభుత్వంలో లోగ్రేడ్ కొనే పరిస్థితి లేదన్నారు. సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినా మిర్చి, పొగాకు, ధాన్యం రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు అండగా నిలిచి మార్క్ఫెడ్ ద్వారా సుమారు రూ.100 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయించారన్నారు. అలా చేయడం వల్ల వారిలో పోటీ పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. ఈ రోజు అటువంటి ప్రక్రియ ఎక్కడా జరగడం లేదన్నారు. ప్రైవేటు వ్యాపారులు వారికి ఇష్టమైన రేట్లు ఇవ్వడంతో రైతాంగం పూర్తిగా నష్టపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వం చేసిన విధానాన్ని అవలంబించి రైతులకు అండగా నిలవాలన్నారు. గతంలో జగన్మోహన్రెడ్డి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకున్నారని చెప్పారు. ఇప్పటికై నా ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు అన్నా కృష్ణ చైతన్య, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, జీ శ్రీనివాసులు, గొలమారి చెన్నారెడ్డి, మెట్టు వెంకటరెడ్డి, గుజ్జుల రమణారెడ్డి, సంజీవరెడ్డి, వైఎం ప్రసాదరెడ్డి, కే నరసింహారావు పాల్గొన్నారు.
ఇప్పటికై నా గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్