అప్పుల సేద్యం చేయలేకనే ఆత్మహత్య..! | - | Sakshi
Sakshi News home page

అప్పుల సేద్యం చేయలేకనే ఆత్మహత్య..!

Jun 8 2025 1:53 AM | Updated on Jun 8 2025 2:00 AM

అప్పు

అప్పుల సేద్యం చేయలేకనే ఆత్మహత్య..!

మార్కాపురం: వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో ఎంతో ఆశగా పంటలు పండించాడు. సొంత పొలం లేకపోయినప్పటికీ కౌలుకు తీసుకుని మరీ ఆరుగాలం శ్రమించి సేద్యం చేశాడు. పెట్టుబడి కోసం ప్రభుత్వ సాయం అందకపోవడంతో అప్పులు చేశాడు. అష్టకష్టాలు పడి పండించిన పంటలకు చివరకు గిట్టుబాటు ధరలు దక్కలేదు. మద్దతు ధరల గురించి సర్కార్‌ సైతం పట్టించుకోలేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక పొలంలోనే పురుగుమందు తాగి ఆ కౌలు రైతు బలవన్మరణం చెందాడు. మార్కాపురం పట్టణంలోని బైపాస్‌రోడ్డులో పెట్రోల్‌ బంకు పక్క రోడ్డులో ఉన్న పొలంలో శనివారం ఉదయం కౌలు రైతు ఆత్మహత్య జిల్లా రైతాంగాన్ని కలచివేసింది. తర్లుపాడు మండలం మీర్జపేట గ్రామానికి చెందిన రాజారపు పెద్ద యలమందయ్య (55) తన భార్య కాశమ్మతో కలిసి 2002లో మార్కాపురం పట్టణంలోని సుందరయ్యకాలనీకి వలస వచ్చారు. బతుకుదెరువు కోసం పలకల పనికి యలమందయ్య వెళ్లేవాడు. ఆ తర్వాత మార్కాపురం పట్టణంలోని బైపాస్‌రోడ్డులో 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. అందులో 2 ఎకరాల్లో గడ్డి సాగుచేస్తూ పాడిగేదెలు చూసుకుంటున్నారు. మిగిలిన పొలంలో కాలాన్ని బట్టి మిర్చి, పత్తి, తదితర పంటలు సాగుచేస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో నష్టాలు చవిచూశాడు. 7 ఎకరాల్లో సాగుచేసిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక పురుగుమందు తాగి యలమందయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 20 నుంచి 25 లక్షల రూపాయల అప్పులున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పులకు తోడు వడ్డీలు కూడా పెరుగుతుండటంతో యలమందయ్య మానసిక వేదనకు గురైనట్లు తెలిపారు.

అప్పులిచ్చిన వాళ్లు ఇంటికొచ్చి గొడవ చేయడంతో...

నాలుగేళ్ల నుంచి పొలాన్ని కౌలుకు తీసుకుని యలమందయ్య పంటలు పండిస్తున్నాడు. ఇటీవల పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చలేకపోయాడు. ఏం చేయాలో పాలుపోక ఆందోళనలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో నెల క్రితం అప్పులిచ్చిన వ్యక్తులు ఇంటివద్దకు వచ్చి గొడవచేసినట్లు బంధువులు తెలిపారు. దీంతో పాటు అతని అల్లుడు కూడా మామ పేరు చెప్పి అప్పు చేయడంతో గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో యలమందయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య కాశమ్మతోపాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురికీ పెళ్లిల్లు చేశాడు. సంఘటనపై మార్కాపురం పట్టణ ఎస్సై సైదుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలడిగి తెలుసుకున్నారు. రైతు సంఘ నాయకులతో పాటు సీపీఎం నాయకులు గాలి వెంకటరామిరెడ్డి, సోమయ్యలు యలమందయ్య మృతదేహాన్ని సందర్శించారు. అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఒకవైపు పంటలకు మద్దతు ధర తరిగి..

మరోవైపు అప్పులు పెరిగి...

మార్కాపురంలో కౌలు రైతు ఆత్మహత్యకు

ఇవే ప్రధాన కారణాలు

పొలంలోనే పురుగుమందు తాగి బలవన్మరణం

అప్పుల సేద్యం చేయలేకనే ఆత్మహత్య..! 1
1/1

అప్పుల సేద్యం చేయలేకనే ఆత్మహత్య..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement