నేడు డీఈవో కార్యాలయం ముట్టడి | - | Sakshi
Sakshi News home page

నేడు డీఈవో కార్యాలయం ముట్టడి

Jun 8 2025 1:54 AM | Updated on Jun 8 2025 2:01 AM

నేడు డీఈవో కార్యాలయం ముట్టడి

నేడు డీఈవో కార్యాలయం ముట్టడి

ఒంగోలు సిటీ: బదిలీలు మాన్యువల్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించాల్సి ఉండగా, దానికి భిన్నంగా వెబ్‌ ఆప్షన్‌ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తుండడంతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఎస్జీటీ, పీఈటీ, పండిట్లకు మాన్యువల్‌ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని విద్యాశాఖ కమిషనర్‌ హామీ ఇచ్చారని, అందుకు భిన్నంగా వ్యవహరించడంపై వారు మండి పడుతున్నారు. అలాగే ఆన్‌లైన్‌ బదిలీల్లో టెక్నికల్‌ సమస్యలు కారణంగా సీనియారిటీ ప్రకారం పోస్టుల చూపించడంలేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. దీనికి వెబ్‌ ఆప్షన్‌ కౌన్సిలింగ్‌ కారణమని అంటున్నారు. వెబ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ శనివారం సాయంత్రం వరకూ జిల్లాలోని మండల విద్యాశాఖ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నగరంలోని డీఆర్‌ఆర్‌ మున్సిపల్‌ స్కూలులో ఆర్‌జేడీ లింగేశ్వర్‌ రెడ్డికి వనతి పత్రం అందజేశారు. బదిలీలు జరుగుతున్న తీరుకు నిరసనగా ఆదివారం డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు అబ్దుల్‌ హై, జనార్దనరెడ్డి, శేషారావు, రవి, వెంకటేశ్వర్లు, వీరాంజనేయులు, పీవీ సుబ్బారావు కోరారు.

జిల్లాలో పలువురు

తహశీల్దార్ల బదిలీ

మరికొందరికి అడహాక్‌ పదోన్నతులు

ఒంగోలు సబర్బన్‌: జిల్లాలో పలువురు తహశీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా రెవెన్యూ అధికారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్‌ ఏ.తమీమ్‌ అన్సారియా ఆదేశాల మేరకు తహశీల్దార్ల బదిలీలు, పలువురికి అడహాక్‌ పదోన్నతులు కల్పించినట్లు డీఆర్‌ఓ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ల్యాండ్స్‌–1లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎస్‌ఎల్‌ నారాయణ రెడ్డిని సంతనూతలపాడు తహశీల్దార్‌గా బదిలీ చేశారు. కొత్తపట్నంలో తహశీల్దార్‌గా పనిచేస్తున్న పిన్నిక మధుసూదనరావును ఒంగోలు అర్బన్‌ తహశీల్దార్‌గా. ఒంగోలు అర్బన్‌ తహశీల్దార్‌గా పనిచేస్తున్న ఎన్‌.వాసును వెలిగండ్ల తహశీల్దార్‌గా. దోర్నాలలో పనిచేస్తున్న అడహాక్‌ తహశీల్దార్‌ కే.శాంతిని కొత్తపట్నంకు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వలేటివారిపాలెంలో పనిచేస్తున్న ఎస్‌.శ్రీనివాసరావును కొండపికి, కొండపిలో పనిచేస్తున్న అడహాక్‌ తహశీల్దార్‌ పి.మురళిని జరుగుమల్లికి, జరుగుమల్లిలో అడహాక్‌ తహశీల్దార్‌ బి.జనార్దన్‌ను మర్రిపూడికి, కలెక్టర్‌ కార్యాలయంలో కోనేరు రంగారావు కమిటీ స్పెషల్‌ తహశీల్దార్‌గా పనిచేస్తున్న సీహెచ్‌.నాగార్జున రెడ్డిని అర్ధవీడుకు, నెల్లూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ల్యాండ్‌ అక్విజిషన్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎస్‌కేఎండీ హుస్సేన్‌ను సీఎస్‌పురం తహశీల్దార్‌గా, తిరిగి విధుల్లోకి తీసుకున్న ఎస్‌కే నాగుల్‌ మీరాను హెచ్‌ఎంపాడు తహశీల్దార్‌గా, రాచర్లలోనే డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న అధికారికి ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌ ఇస్తూ అక్కడే తహశీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నాగులుప్పలపాడు డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న ఆర్‌.వాసుదేవరావుకు పదోన్నతి కల్పించి పరిసాలనా పరమైన సౌలభ్యం కోసం పామూరు తహశీల్దార్‌గా నియమించారు. ప్రకాశం జిల్లా ల్యాండ్‌ అక్విజిషన్‌ డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయంలో స్పెషల్‌ డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న ఏవీఎస్‌.శ్రీనివాస రావును బాపట్ల జిల్లాకు బదిలీ చేశారు. పుల్లలచెరువులో పనిచేస్తూ సెలవులో ఉన్న ఎండీ నయీమ్‌ అహమ్మద్‌ను నెల్లూరు జిల్లాకు కేటాయించారు. తర్లుపాడులో పనిచేస్తూ సెలవులో ఉన్న బి.జయవర్ధన్‌ను కూడా నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ బీసీహెచ్‌ ఓబులేసు విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీలకు మే నెల 16 నుంచి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందేనన్నారు. జూన్‌ 2వ తేదీ వరకు బదిలీలకు గడువు విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను మళ్లీ జూన్‌ 9వ తేదీ వరకు పొడిగించిందన్నారు. అందుకోసం కలెక్టర్‌ ఆదేశాల మేరకు అందరూ ఆర్‌డీఓలు ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని ఆదేశించారు.

ఇమ్మడిచెరువు సర్పంచ్‌గా వెన్నా వెంకటేశ్వరరెడ్డి

వెలిగండ్ల(కనిగిరిరూరల్‌): వెలిగండ్ల మండలం ఇమ్మడిచెరువు సర్పంచ్‌గా ఉప సర్పంచ్‌ వెన్నా వెంకటేశ్వరరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సర్పంచ్‌ తోకల బాలకృష్ణా ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఉప సర్పంచ్‌ వెన్నా వెంకటేశ్వరరెడ్డికి సర్పంచ్‌గా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ.. జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement