
దగా.. మో...సం!
● వివాహం పేరుతో యువకుడిని మోసగించిన కిలేడీలు
● రూ.లక్ష స్వాహా చేసిన ముగ్గురు మహిళలు
కురిచేడు: ‘మంచి అమ్మాయి.. ఈడూ జోడు బాగుంటుందయ్యా..’అంటే గుడ్డిగా నమ్మాడు ఆ యువకుడు. బాజాభజంత్రీలు, పురోహితుడిని మాట్లాడుకున్నాడు. బంధుమిత్రులకు ఆహ్వానం పంపాడు. మొత్తం మీద పెళ్లి తంతుకు సకలం సిద్ధం చేసుకున్నాడు. చివరకు తాను మోసపోయానని తెలియగానే ఒక్కసారిగా కంగుతిన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు మహిళలు మ్యారేజ్ బ్యూరో పేరుతో కురిచేడు మండలంలోని కాటంవారిపల్లె గ్రామానికి చెందిన ఓ యువకుడిని సంప్రదించారు. పెళ్లి కావాల్సిన యువతులు ఉన్నారంటూ సంబంధం మాట్లాడారు. వివాహం కుదిరితే రూ.3 లక్షలు కమీషన్ ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం యువకుడిని విజయవాడ పిలిపించి అక్కడే యువతిని చూపించి నిశ్చితార్థం కూడా చేశారు. అడ్వాన్సుగా లక్ష రూపాయలు తీసుకున్నారు. మిగతా రూ.2 లక్షలు వివాహం కాగానే ఇవ్వాలని షరతు విధించారు. గురువారం రాత్రికి వివాహం జరగాల్సి ఉంది. బుధవారం రాత్రి ప్రదానం తీసుకుని కాటంవారిపల్లెకు చెందిన నలుగురు యువకులు విజయవాడ వెళ్లారు. వివాహం కుదుర్చుకున్న యువకుడు ఇచ్చిన చిరునామాలో ఎవరూ లేకపోవడంతో బిత్తరపోయారు. వారిని సంప్రదించేందుకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ చేసి ఉంది. వివాహం కుదుర్చుకున్న యువకుడికి విషయం చేరవేశారు. గురువారం మధ్యాహ్నం వరకు వేచి చూసిన ఆ యువకులు నిరాశగా వెనుదిరిగారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలా వద్దా అనే మీమాసంలో ఉన్నారు.