
ఎండగడదాం
చంద్రబాబు నయవంచనను
● 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
● వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఆ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున పిలుపు
సంతనూతలపాడు: కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు చేసిన నయవంచనను ఎండగట్టాలని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ సంతనూతలపాడు మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సంతనూతలపాడులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాదైనా నేటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా దగా చేశాడంటూ మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీలు, కులమతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఏడాది పాలన చూసి మోసపోయామని గ్రహించిన ప్రజలు.. కూటమిని గెలిపించి తప్పు చేశామని పశ్చాత్తాపానికి గురవుతున్నారన్నారు. చంద్రబాబు మోసాన్ని, నయవంచనను నిలదీసేందుకు జూన్ 4న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామని మేరుగు నాగార్జున వెల్లడించారు.
ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?
ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. ఎందుకు నెరవేర్చలేదో చంద్రబాబు చెప్పాలని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం పథకం పేరుతో ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఇంత వరకు అమలుచేయలేదన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. 18 ఏళ్లు నిండిన యువతులకు ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామన్నారని, మహిళలకు ఉచిత బస్సు అన్నారని, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారని, కానీ, అవన్నీ ఏమయ్యాయని నిలదీశారు. యువగళంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారం చేపట్టి ఏడాదైనా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. వలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని వారిని అసలు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఇంటింటికి రేషన్ అందించామని, చంద్రబాబు ఎండీయూ వాహనాలను రద్దు చేసి ఇంటి వద్దకే రేషన్ అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదైనా కొత్త పింఛన్ ఒక్కటి కూడా ఇవ్వలేదని, ఉన్న పింఛన్లు తొలగించడం బాధాకరమని అన్నారు. వీటన్నింటికి నిరసనగా నిర్వహించనున్న వెన్నుపోటు దినం ర్యాలీలో చంద్రబాబు చేతిలో మోసపోయిన మహిళలు, రైతులు, నిరుద్యోగులు, వలంటీర్లు భారీగా పాల్గొనాలని మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. సమావేశానికి వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి అధ్యక్షత వహించగా, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, సొసైటీ మాజీ అధ్యక్షుడు దుంపా యలమందారెడ్డి, నాయకుడు రావూరి శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీలు కే వెంకటేశ్వరరావు, కే సుబ్బారావు, వి.కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.