గంజివారిపల్లిలో పులి కలకలం | - | Sakshi
Sakshi News home page

గంజివారిపల్లిలో పులి కలకలం

Jun 1 2025 12:30 AM | Updated on Jun 1 2025 12:46 AM

గంజివ

గంజివారిపల్లిలో పులి కలకలం

యర్రగొండపాలెం: మండలంలోని గంజివారిపల్లిలో పులి కలకలం రేపింది. మూడు రోజుల క్రితం గంజివారిపల్లి నుంచి కొలుకుల వెళ్లే దారిలో ఉన్న పొలాల్లో పులి సంచరించినట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఈ మేరకు అటవీ శాఖాధికారులు తమ సిబ్బందితో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే వారికి పులి సంచరించినట్లు ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. పులి సంచరించినట్లు వచ్చిన సమాచారం మేరకు ఆయా ప్రాంతాల్లోని అటవీ శివారు ప్రాంతాలతోపాటు పొలాలను పరిశీలించామని, పులి అడుగు జాడలు తమకు కనిపించలేదని గంజివారిపల్లె రేంజర్‌ సుబ్బారావు తెలిపారు. పొలం పనులకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని, పులి జాడ తెలిసిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా సీతారామయ్య

ఒంగోలు సబర్బన్‌: ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌గా డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య శనివారం బాధ్యతలు చేపట్టారు. కష్టపడి పని చేసి బ్యాంకును అభివృద్ధి బాటలో నడిపిస్తామని అన్నారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ కుంభా రాఘవయ్య, అధికారులు ఎన్‌.ఇందిరా దేవి, బ్యాంకు డీజీఎమ్‌, ఏజీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.

రంగనాయకుని దర్శనానికి పోటెత్తిన భక్తులు

రాచర్ల: వుండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తొలుత నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం సమీపంలోని నీటిగుండంలో స్నానాలు ఆచరించి, గంటల తరబడి క్యూలో నిలబడి స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు అన్నవరం పాండురంగచార్యులు, సత్యనారాయణచార్యులు ఆధ్వర్యంలో నెమలిగుండ్ల రంగనాయకస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూల అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు కృష్ణదేవరాయుల కాపుబలిజ, గోపాలకృష్ణ యాదవ, కాశినాయన, యోగి వేమన రెడ్ల, ఆర్యవైశ్య అన్నదాన సత్రాల్లో అన్నసంతర్పణ చేశారు. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి ఎడ్ల పందేల విజేత కర్నూలు ఎడ్లజత

తర్లుపాడు: మండల కేంద్రమైన తర్లుపాడులో నీలంపాటి అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు నిర్వహించారు. కర్నూలు జిల్లా పాణ్యంకు చెందిన సుబ్రమణ్యేశ్వరరెడ్డి ఎడ్లజత మొదటి బహుమతిని, బాపట్ల జిల్లా బల్లికురవకు చెందిన పాలూరి వీరయ్య చౌదరికి చెందిన ఎడ్ల జత ద్వితీయ బహుమతిని, కర్నూలు జిల్లా మిడుతూరుకు చెందిన రోలిమెడం ఎడ్ల జత తృతీయ బహుమతి సాధించారు. విజేతలకు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ అన్నా రాంబాబు బహుమతులు అందజేశారు. తొలుత ఆలయంలో అన్నా రాంబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ కన్వీనర్‌ మురారి, ఎంపీపీ రామసుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు రామచంద్రారెడ్డి, గాయం శ్రీనివాసరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, సర్పంచ్‌ పీ వరాలు, వైస్‌ సర్పంచ్‌ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎడ్ల పందెం నిర్వాహకులు వెన్న చిన్న సత్యనారాయణరెడ్డి, ఏరువ మల్లారెడ్డిలను, ట్రాక్టరు దాతలు అశోక్‌రెడ్డి, నాగార్జునరెడ్డిలను మాజీ ఎమ్మెల్యే అన్నా అభినందించారు.

గంజివారిపల్లిలో  పులి కలకలం 1
1/2

గంజివారిపల్లిలో పులి కలకలం

గంజివారిపల్లిలో  పులి కలకలం 2
2/2

గంజివారిపల్లిలో పులి కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement