
ప్రశాంతంగా నీట్ ●
● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన
కలెక్టర్, ఎస్పీ
ఒంగోలు సిటీ: జిల్లాలో ఆదివారం నీట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్, జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయం, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కాలేజీలలో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 1473 మంది అభ్యర్థులకుగాను 1428 మంది పరీక్షలకు హాజరైనట్లు పరీక్షల నిర్వహణ సిటీ కోఆర్డినేటర్ మనీష్ తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు, భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ ను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తనిఖీ చేసి సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో నీట్ పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, డిజిటల్ వాచ్లు, బ్లూ టూత్, కాలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ గాడ్జెట్సును అనుమతించరాదన్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే హాల్లోకి అనుమతించాలన్నారు. పరీక్ష కేంద్రాల వెలుపల 144 సెక్షన్ అమలులో ఉందని, ఈ పరీక్షలు ముగిశాక ఆ పత్రాలు పటిష్ట భద్రతా నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నీట్ పరీక్ష కేంద్రం వద్ద డ్రోన్ కెమెరా తో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ వెంట ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు సిబ్బంది ఉన్నారు.