చిరు వ్యాపారిపై అధికారుల దాష్టీకం | - | Sakshi
Sakshi News home page

చిరు వ్యాపారిపై అధికారుల దాష్టీకం

May 5 2025 8:16 AM | Updated on May 5 2025 8:16 AM

చిరు

చిరు వ్యాపారిపై అధికారుల దాష్టీకం

సాక్షి టాస్క్‌ఫోర్సు: దర్శిలో డీఎస్పీ కార్యాలయానికి అడ్డుగా ఉందనే సాకుతో భారీగా పోలీసులను మొహరించి మరీ ఓ దుకాణాన్ని తొలగించి చిరువ్యాపారిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ సంఘటనతో స్థానికులు సైతం అవాక్కయ్యారంటే అధికారులు, అధికార పార్టీ నేతల దాష్టీకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దర్శి డీఎస్పీ కార్యాలయం ప్రహరీకి రెండు అడుగుల లోపలకు ఉన్నప్పటికీ అడ్డంకి సాకుతో దుకాణాన్ని తొలగించడం కక్ష్యసాధింపులో భాగమేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. బాధితురాలు కొణతం అపర్ణ, ఆమె భర్త సురేష్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. దర్శి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం పక్కనున్న సూరే చెంచుసుబ్బారావు (టీచర్‌)కు చెందిన ఖాళీస్థలాన్ని అపర్ణ, సురేష్‌ అద్దెకు తీసుకున్నారు. అందులో సుమారు రూ.2 లక్షల పెట్టుబడితో విజయపార్లర్‌ కోసం రేకులతో ఓ దుకాణం నిర్మించుకున్నారు. నిర్మాణ సమయంలో చూస్తూనే ఉన్న డీఎస్పీ లక్ష్మీనారాయణ ఏమీ అడ్డుచెప్పలేదు. తీరా నిర్మాణం పూర్తయ్యాక దుకాణాన్ని తొలగించాలని అపర్ణ, సురేష్‌లకు హుకుం జారీ చేశారు. దీంతో మరుసటిరోజు సురేష్‌ తన వద్ద ఉన్న ప్రభుత్వ అనుమతుల పత్రాలను డీఎస్పీకి చూపించారు. వాటిని పరిశీలించి నిరభ్యంతరంగా వ్యాపారం చేసుకోమని డీఎస్పీ చెప్పారు. కానీ, సురేష్‌ను వెంటనే సీఐ రామారావు పిలిపించి అక్కడి నుంచి ఆ దుకాణాన్ని తొలగించాలని, లేనిపక్షంలో అక్రమంగా కేసు బనాయించి జైలుకు పంపుతానని బెదిరించారు. అప్పటికే అన్నీ సిద్ధం చేసుకుని ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకున్న సురేష్‌, అపర్ణలకు ఏం చేయాలో అర్థంగాక అధికారులను ప్రాధేయపడ్డారు. అయినా వారు కనికరించకపోగా, నగర పంచాయతీ కమిషనర్‌ను రంగంలోకి దించారు. శనివారం సాయంత్రం ట్రాక్టర్‌, పంచాయతీ సిబ్బందిని పిలిపించి పోలీసులను మొహరించి దుకాణాన్ని బలవంతంగా తొలగించేందుకు ప్రయత్నించారు.

నిలదీసిన స్థానికులు...

దుకాణం తొలగించడాన్ని చూసిన స్థానిక ప్రజలు సైతం అక్కడకు వచ్చి ఇదేమి న్యాయమంటూ కమిషనర్‌ను నిలదీశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ కార్యాలయానికి అడ్డుగా ఉందని తొలగిస్తున్నామని కమిషనర్‌ మహేష్‌ బదులిచ్చారు. దీంతో స్థానికులు అలా ఎలా తొలగిస్తారని భారీగా అక్కడకు చేరుకోవడంతో దర్శి డీఎస్పీ పరిధిలోని నలుగురు ఎస్సైలు, 20 మంది పోలీసులు జనాలను పక్కకు నెట్టి బంకును బలవంతంగా తొలగించేందుకు ప్రయత్నించారు. కొలతలు వేసి అడ్డుగా ఉంటేనే బంకును తొలగించాలని, అలా కాకుండా ప్రైవేటు స్థలంలో ఉన్న బంకును తొలగించడం ఏమి న్యాయమంటూ కమిషనర్‌ను స్థానికులంతా నిలదీశారు. కనీసం ముందస్తు సమాచారంగానీ, నోటీసుగానీ ఇవ్వకండా ఉన్నపలంగా ఎలా తొలగిస్తారని ప్రజలు ప్రశ్నించినప్పటికీ ఆర్‌అండ్‌బీ స్థలంలో ఉందంటూ ఆర్‌అండ్‌బీ అధికారులు లేకుండానే నిర్ధారించారు. దీంతో స్థలం యజమాని సుబ్బారావు అక్కడకు చేరుకుని స్థలానికి కొలతలు వేయించగా, అతని స్థలంలోనే దుకాణం ఉందని రుజువైంది. చేసేదేమీ లేక దర్శి ఎస్సై మురళి అక్కడున్న ప్రజలపై లాఠీచార్జి చేస్తూ తిట్లపురాణం అందుకుని భయబ్రాంతులకు గురిచేశారు. కమిషనర్‌ కూడా తన సిబ్బంది ద్వారా షాపును పెకిళించి అక్కడి నుంచి బలంవతంగా తొలగించారు. రాత్రి 12.30 గంటల వరకు కమిషనర్‌ అక్కడే ఉండి బంకు తొలగింపు చర్యల్లో పాల్గొనడం ఆయన అత్యుత్సాహానికి నిదర్శనంగా నిలిచింది. ఒక సమయంలో కమిషనర్‌ను సైతం బాధితులు వేడుకున్నారు. తమ పొట్ట కొట్టొద్దంటూ చేతులెత్తి దండంపెట్టారు. కానీ, కనికరించకపోవడంపై స్థానికులు ఇదేమి కక్ష సాధింపు అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసి అధికారులు, పోలీసుల తీరును చీత్కరించుకుంటున్నారు. పోలీసు అధికారులు, నగర పంచాయతీ అఽధికారులు తమ నోటికాడి కూడు తీసివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు చొరవచూపి తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేసి జీవనాధారం కల్పించాలని అపర్ణ, సురేష్‌ విజ్ఞప్తి చేస్తున్నారు.

దర్శిలో డీఎస్పీ కార్యాలయానికి అడ్డుగా ఉందనే కారణంతో దుకాణం తొలగింపు మున్సిపల్‌ కమిషనర్‌ అత్యుత్సాహంతో భారీగా పోలీసుల మొహరింపు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒత్తిడి మేరకే తొలగించారని బాధితుల ఆరోపణ

చిరు వ్యాపారిపై అధికారుల దాష్టీకం1
1/3

చిరు వ్యాపారిపై అధికారుల దాష్టీకం

చిరు వ్యాపారిపై అధికారుల దాష్టీకం2
2/3

చిరు వ్యాపారిపై అధికారుల దాష్టీకం

చిరు వ్యాపారిపై అధికారుల దాష్టీకం3
3/3

చిరు వ్యాపారిపై అధికారుల దాష్టీకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement