
రేపటి నుంచి రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు
ఒంగోలు: రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలను ఈ నెల 31 నుంచి జూన్ 2వ తేదీ వరకు స్థానిక మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి జి.భక్తధృవుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పురుషులకు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్ విభాగాలలో పోటీలు జరుగుతాయన్నారు. మహిళలకు 43, 47, 52 కేజీల విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. 31వ తేదీ సాయంత్రం 3 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు.
గ్రేడ్–2 మున్సిపాలిటీగా గిద్దలూరు
గిద్దలూరు రూరల్: గిద్దలూరు నగర పంచాయతీని గ్రేడ్–2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ గురువారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీని ద్వారా మున్సిపాలిటీకి అదనంగా నిధులు విడుదలై అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. సిబ్బంది పెరుగుదల, అన్నిశాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి హెచ్ఆర్ఏ పెరుగుదల వంటి వసతులు దక్కనున్నాయి. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా 2011 ఆగస్టు 22లో గిద్దలూరు మార్పు చెందింది. ప్రస్తుతం నగర పంచాయతీ నుంచి గ్రేడ్–2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది.
ఇంటర్ విద్య జిల్లాఅధికారిగా ఆంజనేయులు
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారి (డీఐఈఓ)గా తాళ్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొండపల్లి ఆంజనేయులు గురువారం ఒంగోలులోని డీఈఓ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు పనిచేసిన ఐ.శ్రీనివాసరావు నుంచి ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. ప్రిన్సిపాళ్ల సంఘం, అధ్యాపకుల సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆంజనేయులుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ చైర్మన్ కుమ్మరకుంట సురేష్, ప్రిన్సిపాళ్ల సంఘ నాయకులు కె.పి.రంగనాయకులు, బి.సి.హెచ్.అల్లూరయ్య, విశ్వనాథబాబు, వెంకట్రావు, పాలపర్తి మాధవరావు, వై.గురవయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
చీకట్లో
మాన్యువల్ కౌన్సెలింగ్
● ఉపాధ్యాయుల వెబ్ కౌన్సెలింగ్ అమలులో ప్రభుత్వం ఘోర వైఫల్యం
● చివరికి హడావిడిగా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న వైనం
ఒంగోలు సిటీ: స్కూల్ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వెబ్ కౌన్సెలింగ్లో ప్రభుత్వం విఫలమవడంతో రెండు రోజుల నుంచి సంబంధిత ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. అన్ని యాజమాన్యాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయుల బదిలీలు, స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి గత పది రోజులుగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం తారుమారైంది. ఈ పదోన్నతులకు సంబంధించి జెడ్పీలో 83, మున్సిపల్ యాజమాన్యం కింద 4, మున్సిపల్ కార్పొరేషన్ కింద 1 పోస్టుకు పదోన్నతులు నిర్వహించాలని విద్యాశాఖ భావించింది. దీనికి సంబంధించిన పదోన్నతులలో 1:3 నిష్పత్తిలో 245 వరకు పిలిచినట్లు సమాచారం. 28వ తేదీ మధ్యాహ్నం పదోన్నతులు నిర్వహించాలనే సమాచారం అందడంతో ఉపాధ్యాయులంతా ఒంగోలు డీఆర్ఆర్ఎం హైస్కూల్కు చేరుకున్నారు. సాయంత్రం 9 గంటల వరకు ఉన్నారు. అయితే, గురువారం ఉదయం 8 గంటలకు హాజరుకావాలని ఉపాధ్యాయులను కోరారు. సాయంత్రం 6.30 గంటలకల్లా వెబ్ కౌన్సెలింగ్ పెట్టాలని చూశారు. చివరికి మాన్యువల్గా జరుపుకోవాలని డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పారు. ఈ ప్రమోషన్లకి సంబంధించి 28వ తేదీ మధ్యాహ్నం నుంచి 29వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు ఉపాధ్యాయులు పడిగాపులు కాశారు. గత ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ఉపాధ్యాయులు పెట్టుకున్న వెబ్ ఆప్షన్ల ప్రకారం బదిలీలు, పదోన్నతులకు ఆటోమేటిక్గా ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో పూర్తిగా విఫలమైంది. చివరి సమయంలో మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా అనేక అక్రమాలు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి అవకతవకలకు పాల్పడినట్లు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.