
ఆగిన రేషన్ బండి..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రేషన్ సరుకులను ఎండీయూ వాహనం ద్వారా ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేశారు. ఇప్పటి వరకు అదే వ్యవస్థను కొనసాగించిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం జూన్ 1 నుంచి ఆ వాహనాలను రద్దు చేసింది. ఇక నుంచి రేషన్ షాపు వద్దకు వెళ్లి క్యూలో పడిగాపులు కాస్తూ రేషన్ తీసుకోవాలి. దీంతో ప్రజలు అవస్థలు పడటంతో పాటు ఎండీయూ వాహనాల ఆపరేటర్లు రోడ్డున పడ్డారు. జిల్లాలో మొత్తం 1,392 రేషన్ షాపులు ఉన్నాయి. అందుకుగానూ రేషన్ సరఫరా చేసే వాహనాలు 385 ఉన్నాయి. వీటిని రద్దు చేయడంతో 385 మంది ఆపరేటర్లు రోడ్డున పడ్డారు. జిల్లాలో 6,70,627 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులందరూ జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సిందే.