
రైతుల జీవితాలతో కూటమి చెలగాటం
● వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి
సింగరాయకొండ: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. సింగరాయకొండ మండల కేంద్రంలోని వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ రాష్ట్రంలోని పొగాకు రైతుల్లో జిల్లాలోనే 70 శాతం ఉండగా, కొండపి నియోజకవర్గంలోనూ అత్యధికంగా ఉన్నారన్నారు. పొగాకు బోర్డు 170 మిలియన్ టన్నులు పొగాకు పండించుకోవడానికి అనుమతిచ్చిందన్నారు. మే నెలాఖరుకు 70 శాతం కొనుగోలు చేయాల్సి ఉండగా, కేవలం 25 శాతంలోపే కొనుగోలు చేశారన్నారు. గత ప్రభుత్వంలో పొగాకు క్వింటా ధర రూ.38 వేల వరకు ఉంటే.. కూటమి ప్రభుత్వంలో రూ.20 వేలలోపు మాత్రమే ఉందన్నారు. పొదిలి పొగాకు వేలం కేంద్రానికి జగనన్న వస్తున్నాడన్న ప్రకటనతో మేల్కొన్న కూటమి ప్రభుత్వం రూ.20 వేల నుంచి రూ.23 వేలకు కొనుగోలు చేయాలని ఆదేశించినప్పటికి 5 శాతం కొనుగోలు చేసి మిగతా పొగాకు వెనక్కి పంపుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఐఎల్టీడీ కంపెనీ గుత్తాధిపత్యానికి గండికొట్టిన జగనన్న.. మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయించి రైతులకు మంచి ధరలు ఇప్పించారని బత్తుల గుర్తుచేశారు.
రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిన జగనన్న...
రైతులకు మద్దతు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన విషయాన్ని బత్తుల బ్రహ్మానందరెడ్డి గుర్తుచేశారు. ఆ నిధిని రూ.7 వేల కోట్లకు పెంచి రైతుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని జగనన్న చాటుకున్నారన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రూ.5 వేల కోట్లతోఽ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదైనా ఒక్క పంటకూ మద్దతు ధర కల్పించకుండా రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. ఐటీసీ కంపెనీతో కుమ్మక్కై పొగాకు రైతులను నట్టేట ముంచిందన్నారు. మహానాడు వేదికగా సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఎన్నికల్లో చెప్పని పథకాలు కూడా అమలు చేస్తున్నామని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారంటూ బత్తుల బ్రహ్మానందరెడ్డి ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, మండలాల అధ్యక్షులు పిన్నిక శ్రీనివాసులు, చింతపల్లి హరిబాబు, బచ్చల కోటేశ్వరరావు, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సుల్తాన్ పాల్గొన్నారు.