
చిన్నారులు గ్రంథాలయ సభ్యత్వం తీసుకోవాలి
ఒంగోలు టౌన్: చిన్నారులు గ్రంథాలయ సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించాలని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి సూచించారు. జిల్లా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన తరగతులు శనివారం 5వ రోజుకు చేరాయి. 65 మంది చిన్నారులు హాజరుకాగా వారితో కథలు చదివించారు. ఇంగ్లిష్ గ్రామర్, స్పోకెన్ ఇంగ్లిష్, లూసిడా హ్యాండ్ రైటింగ్, యోగా తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఆదిలక్షి తరగతులను సందర్శించారు. క్రాఫ్ట్ క్లాసులో పిల్లలు తయారు చేసిన వస్తువులు చూసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవి విజ్ఞాన తరగతులతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. సెల్ఫోన్లు, ఆన్లైన్ గేమ్లతో చిన్నారుల విలువైన సమయం పాడు కాకుండా మంచి అలవాట్లతో చిన్నారులను తీర్చిదిద్దొచ్చన్నారు. వేసవి విజ్ఞాణ తరగతులకు హాజరయ్యేలా చిన్నారులను ప్రోత్సహించాలని తలిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా గ్రంథాలయ ఉపపాలకురాలు బొమ్మల కోటేశ్వరి మాట్లాడుతూ చిన్నారులకు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తే వారిలోని ఆలోచనలను మేలుకొల్పొవచ్చని చెప్పారు. చిన్నతనం నుంచే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దితే పెద్దయ్యాక బాధ్యత కలిగిన పౌరులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. శిరీష, టి.రవీంద్ర, డి.ప్రసాద్, ఆర్.విందుమణి, టి.శ్రీనివాసరావు, వెంకయ్య పాల్గొన్నారు.