
నేడు 5 కేంద్రాల్లో నీట్
ఒంగోలు సబర్బన్: నీట్ పరీక్షలు ఆదివారం జిల్లాలోని ఐదు కేంద్రాల్లో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. ఈ సందర్భంగా నీట్ పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను కలెక్టర్, ఇతర విభాగాల అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షకు మొత్తం 1,473 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఒంగోలు నగరంలోని కేంద్రీయ విద్యాలయం, జవహర్ నవోదయ, దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కాలేజి, దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజి, డీఆర్ఆర్ఎం మున్సిపల్ స్కూల్లను కేంద్రాలుగా ఎన్టీఏ ఎంపిక చేసిందన్నారు. ఈ 5 కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగేందుకు భద్రతా పరమైన చర్యలతో పాటు అభ్యర్థులకు అవసరమైన రవాణా సౌకర్యం, పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్య శిబిరాలు, విద్యుత్ అంతరాయం లేకుండా చూడటం, పారిశుధ్యం, దివ్యాంగులకు వీల్ చైర్స్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. భద్రత, ప్రశ్నపత్రాల ఓపెనింగ్, అభ్యర్థుల తనిఖీలు, తదితర విషయాల్లో ఎన్టీఏ మార్గదర్శకాలను ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇన్విజిలేటర్లకు అవసరమైన శిక్షణ గురువారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పరీక్షల సిటీ కో ఆర్డినేటర్కు ఆమె సూచించారు. అభ్యర్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసే వాతావరణాన్ని కల్పించే బాధ్యత ఆయా సెంటర్ల సూపరింటెండెంట్లపై ఉందన్నారు. పరీక్ష కేంద్రాల పరిశీలనలో కలెక్టర్తో పాటు డీఆర్ఓ బి.చిన ఓబులేసు, ఇతర అధికారులు ఉన్నారు.
నీట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష ప్రారంభం