
అభివృద్ధిపై అన్నిశాఖలు దృష్టి సారించాలి
ఒంగోలు సబర్బన్: ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి చేయడంపై అన్ని శాఖల అధికారులు మరింత దృష్టి పెట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జోనల్ ఇన్చార్జి అధికారి ఎంటీ కృష్టబాబు సూచించారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆయన.. ఒంగోలులోని ప్రకాశం భవనంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు జిల్లాలో అమలవుతున్న తీరు, వాటి పురోగతిపై ఆయన సమీక్షించారు. శాఖల వారీగా సాధించిన పురోగతి గురించి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సామాజిక పెన్షన్లు – వికలాంగ పెన్షన్ల వెరిఫికేషన్, దీపం 2, సోలార్ విద్యుత్, రక్షిత మంచినీటి సరఫరా, వేసవిలో ఎదురయ్యే సవాళ్లు – పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, పీ–4 అమలు, మీ కోసం అర్జీలు, ఆడిట్ రీ సర్వే–పైలెట్, ఫేజ్–2 పురోగతి, హౌసింగ్, ఉపాధి హామీ పథకాలపై ప్రధానంగా కృష్ణబాబు చర్చించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా నీరు సరఫరా చేయడంతో పాటు నీటి నాణ్యత కూడా ముఖ్యమని చెప్పారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆర్థికంగా స్థిరపడిన వారి వివరాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి తీసుకుంటే మార్గదర్శకులుగా గుర్తించి బంగారు కుటుంటాలకు అండగా ఉండేలా చూడవచ్చని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పల్లె పండుగ పనుల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం నుంచి విడుదలయ్యేలా చూస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాను మెరుగైన స్థానంలో నిలపాల్సిన బాధ్యత అన్ని శాఖలపై ఉందన్నారు. ఆ దిశగా బలం, బలహీనతలను గుర్తెరిగి లక్ష్యానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రకాశం జిల్లా ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో డీఆర్వో బి.చినఓబులేసు, మార్కాపురం సబ్ కలెక్టరు సహదిత్ వెంకట త్రివినాగ్, సీపీఓ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి సంక్షేమ పథకాలన్నీ ప్రజల చెంతకు చేరాలి జిల్లా అధికారులతో సమీక్షలో రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు