
అధినేత నమ్మకాన్ని వమ్ముచేయను
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని, పార్టీ అభ్యున్నతికి పాటుపడతానని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా నియమితులైన బత్తుల బ్రహ్మానందరెడ్డిని గురువారం ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు నూరు శాతం పాటుపడతానన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం బత్తుల నిరంతరం సేవలందిస్తున్నారని పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. అనంతరం జూపూడి ప్రభాకరరావు, చుండూరు రవిబాబు, మాదాసి వెంకయ్య, కుప్పం ప్రసాద్, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, తదితరులు బత్తుల బ్రహ్మానందరెడ్డిని శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.