పొగబెట్టారు! | - | Sakshi
Sakshi News home page

పొగబెట్టారు!

Apr 30 2025 12:23 AM | Updated on Apr 30 2025 12:23 AM

పొగబె

పొగబెట్టారు!

ధరలు కోసి..

పొగాకు రైతులను ఆదుకోవాలి

పొగాకు పంట సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతోపాటు వ్యాపారులు, కంపెనీలు, పొగాకు బోర్డు అధికారుల ప్రోత్సాహంతో ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. వాతావరణం సానుకూలంగా లేకపోవడం, కలుపు, మల్లె ఎక్కువగా వేయడంతో దిగుబడి బాగా తక్కువగా వచ్చింది. అయినా వ్యాపారులు రకరకాల సాకులు చెబుతూ తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వలన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించకపోవడం దారుణం. ప్రభుత్వం పట్టించుకోకపోతే చాలా కుటుంబాలు నష్టాల బారిన పడి కోలుకోని దుస్థితి దాపురిస్తుంది. తక్షణమే ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయించాలి.

– చుండూరి రవిబాబు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త

టంగుటూరు పొగాకు వేలం కేంద్రం

పెట్టుబడులు వస్తాయంతే..

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం గ్రామానికి చెందిన దామచర్ల చిన్నరాజ మూడు బ్యార్నీలకు పొగాకు సాగు చేశాడు. ఇప్పటికి రెండు రౌండ్లు వేలం పూర్తవుతున్నా ధరల్లో ఎటువంటి పెరుగుదల లేదు. పొగాకు సాగు ఖర్చు ఎక్కువైంది. ఖర్చులకు తగ్గట్లు ధరలు లేవు. బోర్డు అధికారులు, పొగాకు కంపెనీల ప్రతినిధులు సిండికేట్‌ అయి ధరల పెరుగుదల విషయంలో చొరవ చూపడం లేదు. ఒకటి కౌలు బ్యార్నీ, రెండు సొంత బ్యార్నీలు, సొంత పొలం కావడంతో పెట్టిన పెట్టుబడి వరకు వస్తుంది. కౌలు రైతులకు మాత్రం లక్షల్లో నష్టాలు తప్పవు. ఇప్పటికై నా మేలిమి పొగాకుకే కాదు లోగ్రేడు పొగాకును కూడా సరైన ధరలకు కొనుగోలు చేసి పొగాకు రైతులను ఆదుకోవాలని చిన్నరాజ కోరుతున్నాడు. వేలంలో అన్ని పొగాకు కంపెనీలు పాల్గొనాలని, ధరలపై బోర్డు అధికారులు శ్రద్ధ చూపాలన్నారు.

పొగాకు రైతుల పరిస్థితి గందరగోళంగా ఉంది. వేలం కేంద్రాల్లో సరైన ధర లభించక దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పంట చేతికొచ్చిన సమయంలో వ్యాపారులు ధర తగ్గించేసి కొనుగోళ్లు చేస్తుండడంతో రైతులు అల్లాడిపోతున్నారు. కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. అండగా నిలవాల్సిన బోర్డు అధికారులు, ప్రభుత్వం వీరిని గాలికి వదిలేయడంతో వ్యాపారులు సిండికేటై రైతును నట్టేట ముంచేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా రైతులు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సంక్షోభంలోకి కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం రీజియన్‌ పరిధిలో ఆరేళ్ల కిందట 20 నుంచి 25 వేల ఎకరాల్లో మాత్రమే పొగాకు సాగు చేసేవారు. నాలుగేళ్లుగా పొగాకు పంటకు మంచి గిట్టుబాటు ధరలు రావడంతో పంట విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. పొగాకు బోర్డు ఈ ఏడాది 68,500 హెక్టార్లలో సాగుకు అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని కంపెనీలు, దళారులు రైతులను ఎక్కువ పంట సాగుచేసేలా ప్రోత్సహించారు. ఆకాశమే హద్దు అంటూ ఊరించారు. పొగాకు బోర్డు అధికారులు కూడా 20 శాతం వరకు అధికంగా పంట వేసుకోవచ్చని చెప్పడంతో రైతులు గుడ్డిగా నమ్మారు. గత ఏడాది ఒక రైతుకు 35 క్వింటాళ్లు అనుమతి ఇవ్వగా ఈ ఏడాది 45 క్వింటాళ్లు అనుమతి ఇచ్చారు. దాంతో నాలుగు డబ్బులు వస్తాయన్న ఆశతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంటసాగు చేశారు. ఈ ఏడాది సుమారు 88 వేల హెక్టార్లలో పొగాకు సాగు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 105.27 మిలియన్‌ కిలోలకు పైగా పంట ఉత్పత్తి అంచనా వేయగా 162 మిలియన్‌ కిలోలుగా ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.

సాగులోకి దిగిన బడుగు రైతులు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సన్నకారు, చిన్నకారు రైతులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా ఎస్సీలు, బీసీలు, కౌలు రైతులు పొగాకు సాగులోకి దిగారు. పొగాకు పంటకు గిరాకీ ఉండడంతో అధిక కౌలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బయటి వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని సాగు చేశారు. అయితే అధిక వర్షాలు మొదట్లోనే దెబ్బ తీశాయి. ఒకటికి రెండు సార్లు నాట్లు వేయాల్సి వచ్చింది. వర్జీనియా పొగాకు దిగుబడి 20 నుంచి 30 శాతం వరకు తగ్గింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యాపారుల గోతికాడి నక్కల్లాంటి తీరు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

నాణ్యత పేరుతో మోసానికి దిగిన వ్యాపారులు...

ఎన్నో ఆశలు పెట్టుకొని పొగాకు సాగు చేసిన రైతుకు బోర్డు అధికారులు, వ్యాపారులు, దళారులు కలిసి టోపీ పెట్టే కుట్రలకు తెరలేపారు. అధికంగా సాగు చేశారని, నాణ్యత బాగా లేదని సాకులు చెబుతూ తక్కువ ధరలకు పొగాకు కొనుగోలు చేస్తున్నారు. మార్చి 10న పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రీజియన్‌ పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో దశల వారీగా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గత ఏడాది బ్రైట్‌ ధర రూ.360 పలకగా ఈ ఏడాది రూ.280 కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. బ్రైట్‌ మీద ఏకంగా రూ.80 పైగా నొక్కేస్తున్నారు. అదికూడా మొత్తం పొగాకును ఒకే ధరకు కొనుగోలు చేయడం లేదు. వేలం కేంద్రాలకు వచ్చిన వాటిలో కేవలం 10 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తక్కువ ధరలకు అమ్ముకుంటే రైతులకు వచ్చేదేమీ లేదు. తీవ్రమైన నష్టాలకు గురికావల్సి వస్తుంది.

నిర్లక్ష్యంగా కూటమి పాలకులు...

పొగాకు వేలం ప్రారంభమై 50 రోజులు దాటింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. పంట విస్తీర్ణం, దిగుబడి, ప్రస్తుతం కొనుగోలు ధరలను సమీక్షించిన దాఖలాలు లేవు. పైగా మమ్మల్ని అడిగి సాగు చేశారా అంటూ అగ్రికల్చరల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ చెప్పడంపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పొగాకు బోర్డు అధికారులు అధిక సాగుకు ప్రోత్సహించడం వల్లే ఈ ఏడాది రైతులు అధికంగా సాగు చేశారన్న సంగతి తెలియకుండా జేడీ మాట్లాడడం వివాదాస్పదమైంది. గత ఏడాదికంటే తక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నా ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంపై రైతులు మండిపడుతున్నారు.

పొగాకు రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఒకసారి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నాటి ప్రభుత్వం పొగాకు రైతులకు అండగా నిలబడింది. 2019–20లో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి మార్కెట్‌లో పోటీ పెరిగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో రైతులు నష్టపోకుండా సరైన ధరలకు అమ్ముకుని లాభాలు మూటగట్టుకున్నారు.

టీడీపీ పాలనలో ప్రతిసారి నష్టాలు మూటగట్టుకుంటున్న రైతులు వేలం ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా పుంజుకోని ధరలు రైతుల ఆందోళనను పట్టించుకోని కూటమి పాలకులు సిండికేట్లతో మోసపోతున్న పొగాకు రైతులు నాణ్యత పేరుతో మెజార్టీ బేళ్లను తిరస్కరిస్తున్న వ్యాపారులు ధరలు రాక ఉసూరుమంటూ వెనక్కి తీసుకుపోతున్న రైతులు ఆత్మహత్యలే శరణ్యమని వేదన వైఎస్సార్‌ సీపీ పాలనలో నాలుగేళ్లు లాభాల పంట

వెనక్కిపోతున్న బేళ్లు...

కూటమి పాలకుల రైతు వ్యతిరేక విధానాలతో చరిత్రలో మొదటిసారిగా వేలం కేంద్రానికి వచ్చిన బేళ్లు వందల సంఖ్యలో వెనక్కి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పదుల సంఖ్యలో మాత్రమే బేళ్లు వెనక్కి వెళ్లేవి. కానీ ప్రస్తుతం ఒక్కో వేలం కేంద్రంలోనే వందల సంఖ్యలో బేళ్లు వెనక్కి వెళుతున్నాయి. కొనుగోళ్లు ప్రారంభమైన తరువాత ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఎక్కడి పంట అక్కడే ఉంది. వ్యాపారులు, దళారుల సిండికేట్‌ మాయాజాలంతో రైతులు పంట అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటి వరకు కేవలం 9.2 మిలియన్‌ కేజీలో పొగాకు మాత్రమే కొనుగోలు చేసినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. ఒక్క టంగుటూరు వేలం కేంద్రం నుంచే రోజుకు వందకు పైగా బేళ్లు వెనక్కి పోతున్నాయి. అయినప్పటికీ పాలకులు మొద్దునిద్ర వీడడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, జిల్లాకు చెందిన ఆరుగురు పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో సంచలనం రేపిందన్న విషయాన్ని గుర్తుచేసుకుని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక రంగంలోకి దిగి రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొగబెట్టారు!1
1/3

పొగబెట్టారు!

పొగబెట్టారు!2
2/3

పొగబెట్టారు!

పొగబెట్టారు!3
3/3

పొగబెట్టారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement