
‘నీట్’గా.. ప్రశాంతంగా.. పరీక్షలు నిర్వహించాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాలో నీట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలో మంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మే నెల 4న జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు మొత్తం 1,473 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఒంగోలు నగరంలోని కేంద్రీయ విద్యాలయం, జవహర్ నవోదయ, దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కాలేజీ, దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజీ, డీఆర్ఆర్ఎం మున్సిపల్ స్కూల్లను కేంద్రాలుగా ఎన్టీఏ ఎంపిక చేసిందన్నారు. కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. భద్రత, ప్రశ్నాపత్రాల ఓపెనింగ్, అభ్యర్థుల తనిఖీలు, తదితర విషయాలలో ఎన్టీఏ మార్గదర్శకాలను ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇన్విజిలేటర్లకు అవసరమైన శిక్షణ గురువారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పరీక్షల సిటీ కో ఆర్డినేటర్కు ఆమె సూచించారు. అభ్యర్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసే వాతావరణాన్ని కల్పించే బాధ్యత ఆయా సెంటర్ల సూపరింటెండెంట్లపై ఉందన్నారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ కె.నాగేశ్వరరావు, డీఆర్ఓ బి. చిన ఓబులేసు, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, డీపీఓ వెంకట నాయుడు, డీఈఓ కిరణ్కుమార్, సిటీ కో ఆర్డినేటర్, ఎన్టీఏ నోడల్ ఆఫీసర్ మనీష్ కుమార్, సెంటర్ సూపరింటెండెంట్లు, విద్యుత్, మున్సిపల్, వైద్య, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు.
రీ సర్వే ప్రక్రియ పటిష్టంగా చేయాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాల్లో రీసర్వే ప్రక్రియ పటిష్టంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి జిల్లా అధికారులను ఆదేశించారు. విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి మంగళవారం రీసర్వే, ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్, వాటర్ ట్యాక్స్ తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాల్లో రీసర్వే ప్రక్రియ పటిష్టంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. రీసర్వే సమస్యలు, సిటిజన్ సర్వీసెస్, పీజీఆర్ఎస్ పరిష్కారంపై దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యమైనదన్నారు. ఆయా దరఖాస్తులను, సమస్యలను పెండింగ్ లేకుండా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్కు ఒంగోలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ను కలిసిన వక్ఫ్బోర్డు సీఈఓ
ఒంగోలు సబర్బన్: కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను వక్ఫ్ బోర్డు సీఈఓ షేక్ మహమ్మద్ అలీ మంగళవారం ప్రకాశం భవన్లో కలిశారు. ఒంగోలు వచ్చిన ఆయన కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని వక్ఫ్ భూముల స్థితిగతులపై సీఈఓ జిల్లా కలెక్టర్తో చర్చించారు.

‘నీట్’గా.. ప్రశాంతంగా.. పరీక్షలు నిర్వహించాలి