
జిల్లాలో పోలీసుల ముమ్మర తనిఖీలు
ఒంగోలు టౌన్: జిల్లాలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు పోలీసులు శనివారం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని హోటళ్లు, లాడ్జిలు, రైల్వే, బస్ స్టేషన్లను తనిఖీ చేశారు. లాడ్జిలలో బసచేసిన వారి ఆధార్, ఇతర వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. అనుమానాస్పదంగా ఉన్న వారి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లాడ్జిలలో బసచేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని యజమానులకు స్పష్టం చేశారు. ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు తావిచ్చినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలు ప్రదేశాలలో డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసింది. వాహనాలను తనిఖీ చేసి రోడ్డు భద్రత ఉల్లంఘనదారులపై ఎంవీ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ మద్యం, గంజాయి వంటి మాదక ద్రవ్యాల రవాణా జరగకుండా తనిఖీలు నిర్వహించారు.