
సూత్రధారులు మిగిలారు..
పాత్రధారులు ఓకే..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. గత మంగళవారం హత్య జరిగినప్పటి నుంచి అనేక ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. తొలుత లిక్కర్ మాఫియా నేపథ్యంలో హత్య జరిగిందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత బియ్యం తగాదాల గురించి చర్చకు వచ్చింది. ఈ లోపు భూ వివాదాలు తెరమీదకు వచ్చాయి. రామాయపట్నం భూములని, వైజాగ్లోని రియల్ మాఫియా తగాదాలని, బెంగళూరు, హైదరాబాద్ల్లో భూ వివాదాలని రకరకాలుగా ప్రచారం జరిగింది. అంతేకాకుండా హంతకులు స్థానికులు కాదని, బీహారీలని సైతం అనుమానాలు వ్యక్తమయ్యాయి. తొలుత పోలీసులు కూడా ఆ దిశగానే దర్యాప్తు చేశారు. మొత్తం 12 బృందాలు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు సైతం వెళ్లాయి. వీరయ్య చౌదరితో వ్యక్తిగత విభేదాలున్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. రైస్ వ్యాపారులతో పాటుగా లిక్కర్, రియల్ వ్యాపారులను అనేక మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. హత్య జరిగిన తరువాత మూడు రోజుల పాటు పురోగతి కనిపించలేదు. ఎలాంటి కీలక ఆధారాలు లభ్యం కాలేదు. చీమకుర్తి దగ్గర ఎప్పుడైతే నిందితులు ఉపయోగించిన స్కూటీ దొరికిందో ఒక్కసారిగా విచారణ వేగం పుంజుకుంది. హత్య కేసులో అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ యువనేతను కీలక అనుమానితుడిగా భావించి విచారణ చేస్తున్నారు. అలాగే అమ్మనబ్రోలుకు చెందిన వ్యాపారి పాత్రపై కూడా ఆధారాలను సేకరిస్తున్నారు. ఇందు కోసం ఒక బృందం హైదరాబాద్కు వెళ్లినట్టు తెలిసింది. అలాగే సంతనూతలపాడు టీడీపీ వాట్సప్ గ్రూప్లో వీరయ్య చౌదరిని ఉద్దేసించి పెట్టిన పోస్టులు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
రెండో వాహనం కూడా స్వాధీనం..
వీరయ్య హత్య కేసులో నిందితులు ఉపయోగించిన మోటారు బైకును సంతనూతలపాడులో శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మోటారు బైకు యజమాని ఎవరు, ఎక్కడి వ్యక్తి అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. శుక్రవారం చీమకుర్తి జాతీయ రహదారి పక్కన ఉన్న ఒక దాబా వద్ద స్కూటీని స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. దీంతో హత్య కేసులోని రెండు వాహనాలు దొరికినట్టేనని చెప్పవచ్చు. స్కూటీ దొరికిన తరువాత విచారణ ఊపందుకున్నట్లే, మోటారు బైకును స్వాధీనం చేసుకున్న తరువాత మిగిలిన నిందితులంతా ఎక్కడివారనేది తేలినట్లు సమాచారం.
హంతకులు నలుగురూ జిల్లా వారే...
హత్యలో మొత్తం నలుగురు పాల్గొన్నట్లు పోలీసులు మొదట్నుంచి చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆ నలుగురు ఎవరనే దాని మీద రకరకాల చర్చ జరిగింది. భారీ మొత్తంలో సుపారీ ఇచ్చి హత్య చేయించారని ప్రచారం సాగింది. పొన్నూరు నుంచి కూడా కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించారు. చివరికి తేలిందేమిటంటే హంతకులంతా జిల్లాకు చెందిన వారేనని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. నగరంలోని కొప్పోలు ప్రాంతానికి చెందిన వ్యక్తి హత్యలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. స్వయంగా అతడు హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతడితో పాటు మిగిలిన ముగ్గురు కూడా జిల్లాకు చెందిన వారేనని సమాచారం. వీరంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరికి సంబంధించిన మొబైల్ ఫోన్లు స్విచాఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు రాత్రే వీరు పరారయ్యారు. చీమకుర్తిలోని జాతీయ రహదారిపై పోలీసుల హడావుడి కనిపించడంతో దానికి కొద్ది సమీపంలోనే ఒక దాబా వద్ద నిందితులు స్కూటీని నిలిపివేసి కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కి పొదిలి వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాలలో రికార్డయింది. ఇద్దరు పొదిలి వైపు వెళ్లినట్లు గుర్తించారు. మిగతా ఇద్దరు ఎటు వెళ్లారన్న దాని మీద స్పష్టమైన సమాచారం లేదని తెలుస్తోంది. వైజాగ్ వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నా హైదరాబాద్, కర్నూలు వైపు వెళ్లినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ నలుగురు దొరికితే వారి వెనక ఉన్న సూత్రధారుల గుట్టు రట్టవుద్దని పోలీసులు భావిస్తున్నారు.
వివిధ ప్రాంతాల్లో పోలీసుల గాలింపు...
వీరయ్య చౌదరి కేసులో ఒంగోలు పోలీసులు బృందాలుగా విడిపోయి విస్తృతంగా గాలిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లిన బృందాలు సాంకేతిక సమాచారాన్ని వినియోగించుకొని వేట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని సమాచారం. ఈ హత్యలో పాల్గొన్న కీలక నిందితుని తల్లిదండ్రులను, భార్యను పోలీసు స్టేషన్కు తరలించి విచారించారు. వారితో నిందితుడు టచ్లో ఉన్నట్లు ఏమైనా ఆధారం దొరుకుతుందేమోనని ప్రయత్నం చేశారు. వారి నుంచి ఎలాంటి క్లూ లభించకపోవడంతో వారిని వదిలిపెట్టినట్లు సమాచారం.
నగరంలో పోలీసుల విస్తృత తనిఖీలు:
నగరంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కూడళ్లతో పాటు షాపింగ్ మాళ్లు, వ్యాపార వాణిజ్య భవనాలను పూర్తిగా తనిఖీలు చేశారు. ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, హోటళ్లు, లాడ్జీలను ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ తనిఖీలలో బాంబు స్క్వాడ్ , డాగ్ స్క్వాడ్ పాల్గొనడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
హంతకులు నలుగురూ జిల్లా వాసులే.. వారి కోసం విస్తృతంగా గాలింపు స్విచ్ఛాఫ్లో నిందితుల ఫోన్లు వారి బంధువులను సైతం విచారిస్తున్న పోలీసులు సంతనూతలపాడు వద్ద రెండో వాహనం స్వాధీనం శనివారం బైక్పై ఎస్పీ తనిఖీలు
బైకు మీద ఎస్పీ గాలింపు చర్యలు:
వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వయంగా మోటారు బైకు మీద తిరుగుతూ గాలింపు చర్యలను పర్యవేక్షించారు. నిందితులు తలదాచుకునేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామ శివారు ప్రాంతాల్లో కూడా తిరిగారు. నిందితులను పట్టుకునేందుకు తీసుకుంటున్న చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే ఎలాంటి సమాచారం లభించినా పోలీసులకు తెలియజేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.

సూత్రధారులు మిగిలారు..