
బస్టాండ్ విస్తీర్ణం: 2.18 ఎకరాలు
డిపోలో బస్సుల సంఖ్య: 102
మార్కాపురం: మార్కాపురం బస్టాండ్ పశ్చిమ ప్రకాశం వాసులకు ఎంతో కీలకం. 1993లో బస్టాండ్ను ప్రారంభించారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటై 32 ఏళ్లు దాటినా సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఏళ్లు గడుస్తున్నా.. పెద్ద ఎత్తున ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నా... ఆదాయం పెరుగుతున్నా.. సౌకర్యాల కల్పనలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. ఇప్పటికీ ఒంగోలు, కనిగిరి, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ప్లాట్ఫాం లేదు. ఫలితంగా బస్సులు ఆగినప్పుడు ఇబ్బందులు పడాల్సిందే. వర్షం పడినప్పుడు వర్షానికి తడుస్తూ, ఎండాకాలంలో ఎండకు ఎండుతూ బస్సులు ఎక్కాల్సిన దుస్థితి. డివిజన్ కేంద్రంగా ఉన్న ఇక్కడ నుంచి ప్రతి రోజు సుమారు అన్నీ ప్రాంతాలకు మార్కాపురం నుంచి 5 వేల మందికి పైగా ప్రజలు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. బస్టాండులో రాత్రి, మధ్యాహ్న సమయంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు భోజనం చేసేందుకు క్యాంటీన్ లేకపోవడంతో బిస్కెట్లు తిని టీ తాగి కడుపు నింపుకుంటున్నారు. కొంత మంది ఆర్టీసీ డ్రైవర్లు పెద్దారవీడు మండలం కుంట, కంభం, బేస్తవారిపేట మధ్య భోజనాల కోసం బస్సులు ఆపుతున్నారు. టైం కాని టైంలో భోజనానికి ఆపినా ప్రయాణికులు తినలేక పోతున్నారు.
కనీస సౌకర్యాలు నిల్...
బస్టాండులో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు, తెలంగాణ రాజధాని హైదరాబాద్, పొరుగు జిల్లాలు కడప, నంద్యాల, కర్నూలు జిల్లాలకు ప్రతి రోజూ 1500 మంది ప్రయాణికులు వెళ్లి వస్తుంటారు. ఈ బస్సులను బస్టాండు ప్రాంగణంలోనే నిలుపుతున్నా ప్లాట్ఫాం లేకపోవడంతో ఎండలో నిలబడి బస్సు వచ్చిన సమయానికి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతాలకు ఆదాయం ఉన్నప్పటికీ సౌకర్యాలు మాత్రం రవాణా శాఖ అధికారులు కల్పించలేదు. ఇక బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. సరైన నిర్వహణ లేకపోవడంతో ప్రయాణికులు పే అండ్ యూజ్ టాయిలెట్స్ వాడుతున్నా వాటి నిర్వహణ కూడా మరింత అధ్వానంగా తయారైంది. బస్టాండు ఆవరణలో ఉన్న నీళ్ల ట్యాపులు కూడా అరకొరగా వస్తూ ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడతాయి.
అర్ధరాత్రి దాటితే బస్టాండుకులోకి రాని రాయలసీమ బస్సులు
అర్ధరాత్రి దాటితే విజయవాడ నుంచి అనంతపురం, అనంతపురం నుంచి విజయవాడ మార్గమధ్యంలో ఉన్న పులివెందుల, కడప, రాయదుర్గం, హిందూపురం, నంద్యాల, బద్వేలు, ప్రొద్దుటూరు, తాడిపత్రి, ధర్మవరం, పెనుకొండ తదితర డిపోలకు చెందిన బస్సులు బస్టాండుకు రాకుండా మార్కాపురం మండలంలోని కుంట మీదుగా హైవేపై వెళ్లిపోతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ రూట్లలో తిరిగే బస్సుల్లో ఎవరైనా మార్కాపురం పట్టణంలో దిగే ప్రయాణికులు ఉంటేనే బస్టాండుకు వస్తున్నాయి. లేకుంటే హైవేపై వెళ్లిపోతున్నాయి. ఉదయం పూట హైదరాబాద్ వెళ్లేందుకు మార్కాపురం డిపో నుంచి బస్సులు లేవు. ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య హైదరాబాద్కు వెళ్లే బస్సులు ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ నుంచి విశాఖపట్నం, అన్నవరం, సింహాచలం, రాజమండ్రికి కూడా బస్సు సౌకర్యం లేదు. విజయవాడకు వెళ్లి ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి.
విజయవాడ– అనంతపురం హైవేతో పెరిగిన తాకిడి
విజయవాడ–అనంతపురం హైవే రోడ్డు ఏర్పాటు తరువాత ప్రయాణికుల రాకపోకలు, బస్సుల రద్దీ కూడా పెరిగింది. ఇదే సమయంలో కర్నాటక నుంచి వచ్చే లారీలు కూడా దగ్గరి మార్గంగా అనంతపురం, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, వినుకొండ మీదుగా విజయవాడ వెళ్తున్నాయి. మార్కాపురం డిపో నుంచి రాత్రి 9 గంటలు దాటిన తరువాత విజయవాడకు నేరుగా బస్సులు లేవు. రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే బస్సులు మార్కాపురం బస్టాండుకు వస్తేనే ప్రయాణికులు విజయవాడ వెళ్తున్నారు. లేకుంటే ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది.