ఆధిపత్యమా..ఆర్థిక లావాదేవీలా..? | - | Sakshi
Sakshi News home page

ఆధిపత్యమా..ఆర్థిక లావాదేవీలా..?

Apr 26 2025 1:13 AM | Updated on Apr 26 2025 1:13 AM

ఆధిపత

ఆధిపత్యమా..ఆర్థిక లావాదేవీలా..?

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసు కీలక పురోగతి సాధించింది. దారుణ హత్య జరిగిన నాటి నుంచి వివిధ రకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రధానంగా లిక్కర్‌, భూ, ఆర్థిక, రైస్‌ మాఫియా వివాదాలే కారణమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పోలీసులు ఆ దిశగా ముమ్మర దర్యాప్తు చేశారు. అయితే శుక్రవారం చీమకుర్తి వద్ద హత్యకు వినియోగించిన స్కూటీ లభ్యం కావడంతో కేసు పురోగతి సాధించింది. దాదాపు కేసులో కీలక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. హత్యకు సంబంధించి అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ యువనేత ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. ఆధిపత్య పోరు నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఆ దిశగా వివరాలను సైతం రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ హత్యకు సంబంధించి టీడీపీ నేతల ప్రమేయం ఉందని తేలడంతో ఈ కేసు ఎటు దారి తీస్తుందోనని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజులుగా ఎలాంటి క్లూ లభించని పోలీసులు ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటున్నారు. టీడీపీ నాయకుని హత్య జరిగిన సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర హోం మంత్రి అనిత రాత్రికి రాత్రే ఒంగోలు వచ్చారు. అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు ఇక్కడే గడిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అమ్మనబ్రోలు వచ్చి వీరయ్యకు నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో వీరయ్య హత్య కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. 12కు పైగా బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎంత మంది అనుమానితులను విచారించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. విశాఖ, రామాయపట్నం, కావలి, బెంగళూరు, హైదరాబాద్‌ అంటూ అనేక ప్రాంతాల పేర్లు కూడా ప్రచారం జరిగింది. రకరకాల కథనాలు వచ్చాయి. ఈ కోణంలో జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా సుమారు 40 మంది వరకు అనుమానితులను తీసుకొచ్చి విచారణ చేశారు. అయినా పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. చివరికి ఘటనా స్థలాన్ని రెండోసారి కూడా ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ సందర్శించి మరోసారి ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.

60 శాతం సీసీ కెమెరాలు..మలుపు తిప్పిన స్కూటీ..

ఈ హత్య కేసు పురోగతికి సంబంధించి 60 వాతం సీసీ కెమెరాలు ఉపయోగపడ్డాయని తెలుస్తోంది. మిగతా 40 శాతం చీమకుర్తి జాతీయ రహదారి పక్కన ఒక్క దాబా వద్ద హంతకులు వినియోగించినట్లు చెబుతున్న స్కూటీ దొరకడంతో కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్టయింది. ముందుగా స్కూటీని పెట్రోలింగ్‌ పోలీసులు గమనించారు. దాని మీద రక్తపు మరకలు ఉండటంతో పక్కనే ఉన్న వారిని విచారించారు. మూడు రోజులుగా ఆ స్కూటీ ఇక్కడ ఉన్నట్లు స్థానికులు చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు చీమకుర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే రంగంలోకి దిగిన చీమకుర్తి పోలీసులు స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. స్కూటీ మీద ఉన్న రక్తపు మరకలను వైద్య పరీక్షలు చేయించగా వీరయ్య చౌదరి రక్తంతో సరిపోయినట్లు తెలిసింది. దాంతో వెంటనే వాహన యజమాని కోసం ఆరా తీశారు. ఒంగోలు ఇస్లాంపేటలోని ఒక వ్యక్తి పేరు మీద వాహనం ఉన్నట్లు తెలుసుకొని అతడిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలుస్తోంది. ఆ స్కూటీని అమ్మనబ్రోలుకు చెందిన వారికి విక్రయించానని చెప్పడంతో కేసు కీలక మలుపు తిరిగింది. అయితే బండిని తన పేరు మీదే ఉందని చెప్పినట్లు తెలిసింది. దీంతో కథ వీరయ్య చౌదరి స్వగ్రామం అమ్మనబ్రోలుకు చేరింది. ఆ గ్రామంలోనే టీడీపీ యువనేత ఈ హత్యకేసులో కీలకంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అతనిని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఆధిపత్య కారణాలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద వీరయ్య చౌదరి హత్య కేసు ఒక కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

హత్య జరిగిన రోజు నుంచే....

నిజానికి వీరయ్య చౌదరి హత్య జరిగిన రోజు రాత్రే అమ్మనబ్రోలుకు చెందిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల పాటు విచారించినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో వదిలిపెట్టినట్లు తెలిసింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని, ఎప్పుడు పిలిచినా పోలీసు స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని చెప్పి పంపించినట్లు సమాచారం. ఇప్పుడు అతడే ప్రధాన నిందితుడని తెలిసి పోలీసులు విస్మయానికి గురయ్యారు. నిందితుడి స్వగ్రామం అమ్మనబ్రోలు అయినా ఒంగోలు నగరంలోని కమ్మపాలెంలో నివాసం ఉంటాడని ప్రచారం జరుగుతోంది. అంజయ్య రోడ్డులో కార్యాలయం కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

హత్యలో పాల్గొంది ఎక్కడి వారు..

వీరయ్య చౌదరి కేసులో మొత్తం నలుగురు నిందితులు హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అమ్మనబ్రోలుకు చెందిన ప్రధాన నిందితుడితో పాటుగా ఒంగోలుకు చెందిన మరొక వ్యక్తి కూడా కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. హత్యలో అతడు స్వయంగా పాల్గొన్నట్లు సమారం. అదేరోజు అతడు వైజాగ్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. వైజాగ్‌లో అతడిని పటు్‌ుట్కన్న పోలీసులు విమాన మార్గంలో విజయవాడకు తరలించి, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఒంగోలుకు తరలిస్తున్నట్లు సమాచారం. అలాగే కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి కూడా మరొక నిందితుడిని పోలీసులు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరి వివరాలను సేకరిస్తున్నట్టు తెలిసింది.

తెరపైకి కొత్త పేర్లు

వీరయ్య చౌదరి హత్య కేసులో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అమ్మనబ్రోలుకే చెందిన మరో వ్యక్తి సైతం ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంత కాలంగా ఆయనకు, వీరయ్య చౌదరికి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఆయన ఆర్థిక మూలలను దెబ్బ తీసేందుకు వీరయ్య చౌదరి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దాంతో ప్రధాన నిందితుడితో కలిసి ఈ హత్యకు ప్లాన్‌ చేసినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. హత్య కేసులో పురోగతి కనిపించడంతో ఆ వివరాలను జిల్లా అధికారులు రాష్ట్ర హోం శాఖ మంత్రికి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రెండు రోజుల్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ అమ్మనబ్రోలుకు వస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అమ్మనబ్రోలులో హై అలర్ట్‌

నాగులుప్పలపాడు: మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య నేపథ్యంలో గ్రామంలో హైఅలర్ట్‌ నెలకొంది. గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకుని పేరు ఈ హత్య కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన పోలీసులు కస్టడీలోనే ఉన్నట్లు తెలిసింది. వీరిరువురికి గ్రామంలో గతంలో వర్గపోరు ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ముదిరిపాకాన పడ్డాయన్న ప్రచారం జరుగుతోంది. ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరే ఈ హత్యకు దారితీశాయా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇక గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుగానే పోలీసులు గ్రామంపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఇప్పటికే ప్రత్యేక బలగాలు గ్రామంలో మొహరించాయి. ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ శుక్రవారం సాయంత్రం 6.40 ప్రాంతంలో గ్రామానికి వచ్చారు. టీడీపీ నేత కుటుంబ సభ్యులను విచారించారు. దాదాపు మూడు గంటల పాటు ఆయన గ్రామంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోనే ప్రతి ఒక్కరూ సహనంతో వ్యవహరించాలన్నారు. ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దన్నారు. చట్టప్రకారం నిందితులను పట్టుకుంటామన్నారు. ఎవరైనా క్షణికావేశంతో అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

వీరయ్య చౌదరి హత్య కేసును మలుపు తిప్పిన స్కూటీ అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ యువనేతే సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు పోలీసుల అదుపులో కీలక నిందితుడు అమ్మనబ్రోలులో హై అలర్ట్‌ ఈ హత్యలో టీడీపీ నేతల ప్రమేయం వెలుగు చూస్తుండడంతో ఆందోళనలో అధికార పార్టీ ముఖ్యనేతలు 60 శాతం సీసీ కెమెరాలు పట్టిస్తే.. మిగతా కేసును కొలిక్కి తెచ్చిన స్కూటీ కీలక ఆధారాలు లభ్యమవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు

ఆధిపత్యమా..ఆర్థిక లావాదేవీలా..?1
1/1

ఆధిపత్యమా..ఆర్థిక లావాదేవీలా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement