సిండికేట్ల రొయ్యో! | - | Sakshi
Sakshi News home page

సిండికేట్ల రొయ్యో!

Apr 26 2025 1:13 AM | Updated on Apr 26 2025 1:13 AM

సిండికేట్ల రొయ్యో!

సిండికేట్ల రొయ్యో!

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఏళ్లుగా ఆక్వా సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్‌ను ఎక్స్‌పోర్టు చేస్తున్న ప్రాసెసింగ్‌ కంపెనీలు శాసిస్తున్నాయి. రొయ్యల ధరలు ఇష్టమొచ్చినట్లుగా తగ్గించేస్తున్నారు. ఫీడు ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఆక్వా సాగు చేస్తున్న రైతులకు యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ ఇస్తామన్న హామీని టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఎగ్గొట్టింది. అన్నీ తలచుకొని ఆక్వా రైతులు విలవిల్లాడుతున్నారు. గిట్టుబాటు ధర రాక సతమతమవుతున్నారు. ట్రంప్‌ సుంకాల పేరు చెప్పి ఎగుమతిదారులు అడ్డగోలుగా ధరలు తగ్గించేయడంతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. కంపెనీలు చెల్లిస్తున్న ధరలు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావని ఆవేదన చెందుతున్నారు.

జిల్లాలో 14 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. అందులో 12 వేల ఎకరాల్లో టైగర్‌ రొయ్య, రెండు వేల ఎకరాల్లో వనామీ రకాన్ని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి సాగు చేపట్టారు. నెల రోజుల నుంచి సాగుతో ఆక్వా రైతులు ముమ్మరంగా ఉన్నారు. మంచి ధరలు ఉండడంతో దాదాపు 30 టన్నుల సీడును తీసుకొచ్చి సాగు ప్రారంభించారు. ప్రారంభంలో మంచి ధరలు ఉన్నా సాగు ప్రారంభమయ్యాక రేట్లు పతనమయ్యాయి. ఇక మార్కెట్లో ఫీడు ధరలు తగ్గినా కంపెనీలు మాత్రం తగ్గించకపోవడం, సోయా ధరలు భారీగా తగ్గినా కేవలం రూ.3 లు తగ్గించడంతో రైతుకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు.

20 రోజుల్లో భారీగా పడిపోయిన ధరలు:

టైగర్‌ రొయ్యల ధరలు 20 రోజుల్లో భారీగా పడిపోయాయి. సాగు ప్రారంభానికి ముందు వరకు 20 కౌంట్‌ టైగర్‌ రొయ్యలు కిలో రూ.680 వరకు ధర పలికింది. ట్రంప్‌ టారిఫ్‌, వ్యాపారులు సిండికేట్‌ కావడంతో ఒక్క సారిగా కిలోకు రూ.100 తగ్గిపోయింది. ప్రస్తుతానికి ట్రంప్‌ టారిఫ్‌ సుంకం లేకపోయినా సిండికేట్‌ వ్యాపారులు ఏమాత్రం పెంచటం లేదు. దాంతో ఒక్కో రైతు లక్షల్లో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పెరిగిన లీజు, ఫీడ్‌, విద్యుత్‌ చార్జీలతో 100 కౌంట్‌కు రావాలంటే కిలోకు రూ.220– రూ.250 వరకు ఖర్చవుతుంది. అదే 50 కౌంట్‌ కు చేరాలంటే కిలోకు రూ.330– రూ.350 వరకు, గరిష్టంగా 30 కౌంట్‌కు రావాలంటే కిలోకు రూ.450– రూ.490 ఖర్చు అవుతోంది. మరి 20 కౌంటుకు రావాలంటే కిలోకు రూ.500లకు పైనే వ్యయం అవుతుంది. ఎకరా సాగుకు సీడ్‌, సాగుకు అవసరమైన హెల్త్‌కేర్‌ మినరల్స్‌, కరెంటు చార్జీలు, కూలీ ఖర్చులు అన్నీ కలుపుకుని సుమారు రూ.7 లక్షల వరకూ ఖర్చవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం రైతుకు కష్టకాలమనే చెప్పాలి. రానున్న రోజుల్లో ధరలు మరింత పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్న నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే హామీ గాలికి..

ఆక్వాజోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌ విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతి రైతుకు యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50 కే సరఫరా చేస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు హామీ ఇచ్చారు. సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్‌ ఫార్మర్లు, ఇతర ఆక్వాకు సంబంధించిన పరికరాలపై అందిస్తామని కూడా నమ్మబలికారు. ఆ హామీని గాలికి వదిలేయటంతో రైతులు లక్షలాది రూపాయలు కరెంటు బిల్లుల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆక్వా రైతుపై భారం మోయలేనంతగా పడుతోంది.

ఆక్వాకు అండగా వైఎస్‌ జగన్‌...

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ ఆక్వా రైతులకు అండగా నిలిచింది. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు అప్సడా చట్టంతో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఆదుకుంది. కరోనా సమయంలో ధరలేక 100 కౌంట్‌ రూ.150 – రూ.180 మధ్య కంపెనీలు కొనుగోలు చేస్తున్న సమయంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.210గా నిర్ణయించి అంతకంటే తక్కువకు కొనుగోలు చేయకుండా కట్టడి చేసింది. సంక్షోభ సమయంలో సీనియర్‌ మంత్రులతో ఆక్వా రైతు సాధికార కమిటీని నియమించి ప్రతి 15 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా సమీక్షించి తగ్గకుండా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా పెంచిన ఫీడ్‌ ధరలను మూడుసార్లు వెనక్కి తీసుకునేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫలితంగా మేత ఖర్చులు భారం రైతులపై పడకుండా అడ్డుకుందని ఆక్వా రైతులు గుర్తు చేసుకుంటున్నారు.

ధరలు తగ్గించేస్తూ ఆక్వా రైతులను ముంచేస్తున్న సిండికేట్లు 20 రోజుల్లో భారీగా పడిపోయిన ధరలు సాగుకు ముందు 20 కౌంట్‌ టైగర్‌ రొయ్య ధర రూ.680 నేడు రూ.580కి పతనం గుదిబండగా మారుతున్న కరెంటు చార్జీలు అందుబాటులోకి రాని ఫీడు, మినరల్‌ ధరలు ఆక్వా రైతును గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం జిల్లాలో 12 వేల ఎకరాల్లో టైగర్‌ రొయ్యల సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement