నల్లబర్లీకి గిట్టుబాటు ధర కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

నల్లబర్లీకి గిట్టుబాటు ధర కల్పించాలి

Apr 25 2025 11:30 AM | Updated on Apr 25 2025 11:30 AM

నల్లబర్లీకి గిట్టుబాటు ధర కల్పించాలి

నల్లబర్లీకి గిట్టుబాటు ధర కల్పించాలి

ఒంగోలు టౌన్‌: రాష్ట్రంలో నల్ల బర్లీ పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని.. క్వింటాకు రూ.15 వేల మద్దతు ధర ప్రకటించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు డిమాండ్‌ చేశారు. గురువారం మల్లయ్య లింగం భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లబర్లీ పొగాకు రైతుల పట్ల వ్యాపారులు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ దోపిడికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గత ఏడాది సరాసరిన రూ.15 వేలకు కొనుగోలు చేస్తే, ఈ ఏడాది కేవలం రూ.3 నుంచి రూ.4 వేలకు మాత్రమే కొంటున్నారని మండిపడ్డారు. ఇదేం న్యాయమని ప్రశ్నిస్తే రైతులు అధికంగా పొగాకు పండించారని, అంతర్జాతీయంగా బర్లీ పొగాకు డిమాండ్‌ లేదని మాయమాటలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక విస్తీర్ణంలో సాగు చేయమన్నది కార్పొరేట్‌ శక్తుల తొత్తులే కదా అని నిలదీశారు.

సాకులు చెప్తున్న కంపెనీలు..

నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ రాజమోహన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బర్లీ పొగాకు సాగు చేసింది అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన కౌలు రైతులేనని తెలిపారు. గతేడాది వచ్చిన ధరలను చూసి ఎక్కువ భాగం పేద రైతులు వ్యవసాయంలోకి వచ్చారని, బంగారం తాకట్టు పెట్టి, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేశారని చెప్పారు. నాడు ఏ కంపెనీలైతే అధిక విస్తీర్ణంలో పంట పండిచేందుకు ప్రోత్సహించారో ఇప్పుడదే కంపెనీలు అధిక విస్తీర్ణంలో పంట పండించారని సాకులు చెప్పడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. వీరారెడ్డి, ఉపాధ్యక్షులు హనుమంతరావు మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి 30వ తేది వరకు జిల్లాలోని ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతి పత్రాలను ఇస్తామని, అప్పటికీ స్పందన లేకపోతే మే 5న చలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు నాయకులు వడ్డే హనుమారెడ్డి, పమిడి వెంకటరావు, భీమవరపు సుబ్బారావు, కోడూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మోసం చేస్తున్న కంపెనీలు

పట్టించుకోకపోతే ‘చలో ముఖ్యమంత్రి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement