
ఆ మూడు నిమిషాలు ఏం జరిగింది.?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఇంతకూ ఆ రోజు ఏం జరిగింది. ఎంత మంది లోపలకు వచ్చారు. ఆ మూడు నిమిషాల్లో జరిగిన ఘటనకు సంబంధించిన విషయాలేమిటి. టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య జరిగిన తీరు, వివరాలను సేకరించేందుకు స్వయంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ రంగంలోకి దిగారు. హత్య జరిగి దాదాపు 48 గంటలు దాటినా చిన్నపాటి క్లూ కూడా లభించకపోవడంతో పోలీసులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనికితోడు సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. వీరయ్య చౌదరి హత్యకు బలమైన కారణాలుండి ఉండొచ్చన్న దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రధానంగా భూ వివాదాలతో పాటు మద్యం, ఆర్థిక వివాదాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ 40 మందిని అదుపులోకి తీసుకుని విచారించినా కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. కేసును స్వయంగా పరిశీలించేందుకు ఎస్పీ ఏఆర్ దామోదర్ గురువారం సాయంత్రం ఘటన స్థలానికి వచ్చారు. దాదాపు మూడు గంటల పాటు విచారణ జరిపారు. హత్య జరిగిన సమయంలో కార్యాలయంలో వీరయ్య చౌదరి సహాయకుడితో పాటు ఆడిటర్, మహిళా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వారి నుంచి ఎస్పీ పూర్తి వివరాలడిగి తెలుసుకున్నారు. ముగ్గురు నిందితులు లోపలకు వచ్చారని, ఎవరు మీరు, ఎందుకొచ్చారని ప్రశ్నించగా కత్తి చూపి బెదిరించారని, దాంతో తాము భయంతో చూస్తుండిపోయామని చెప్పినట్లు తెలిసింది. నిందితులు లోపలకు వచ్చినప్పుడు కుర్చీలో ఉన్న వీరయ్య చౌదరి లేచి నిలబడిన వెంటనే ఆయనపై కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసినట్లు వివరించారని తెలిసింది. వచ్చిన ముగ్గురిలో ఇద్దరు నిందితులు గొంతు నుంచి ఛాతి, పొత్తి కడుపు, వీపు భాగంలో కత్తులతో కసితీరా పొడవడంతో ఆయన రక్తపు మడుగులో పడిపోయినట్లు చెప్పారని సమాచారం. ఒక్కొక్కరితో విడివిడిగా ఎస్పీ మాట్లాడి వివరాలు సేకరించారు. కార్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
భూ వివాదాలే కారణమా..?
ఇప్పటి వరకు విచారణ జరుగుతున్న తీరును గమనిస్తే వీరయ్య చౌదరి హత్యకు భూ వివాదాలే ప్రధాన కారణం కావచ్చని భావిస్తున్నారు. వీరయ్య చౌదరికి జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా రామాయపట్నం, హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు ప్రాంతాల్లో భూ వివాదాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఆరు నెలలుగా హైదరాబాద్లో ఓ భూ వివాదం ఉన్నట్లు సమాచారం. ఈ వివాదంలో ప్రత్యర్థులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే వైజాగ్లోని భీమిలి, కోమలి, మధురానగర్ తదితర ప్రాంతాల్లోనూ భూ వివాదాలున్నట్లు సమాచారం. ఇక్కడ కూడా భూ వివాదానికి సంబంధించిన ఘర్షణ జరిగినట్లు చెబుతున్నారు. కర్ణాటకలోనూ రియల్ దందా చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వివాదాస్పద భూములు కొనుగోలు చేయడం ఆయన ప్రాణాల మీదకు తెచ్చిందన్న ప్రచారం జరుగుతోంది.
వాహనాలు ఏమయ్యాయి..?
వీరయ్య చౌదరి హత్యకు ఉపయోగించిన స్కూటీ, మోటారు బైకు ఎక్కడి నుంచి వచ్చింది.. ఆ వాహనాలను సమకూర్చిందెవరు.. వాటిని ఎక్కడ వదిలిపెట్టి వెళ్లారన్న విషయాలపై జోరుగా చర్చ జరుగుతోంది. హత్య తర్వాత నిందితులు ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్ పక్కన వున్న సుజాత నగర్ నుంచి బైపాస్లోకి వెళ్లి అక్కడి నుంచి వెంకటేశ్వర కాలనీలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ దారిలో సీసీ కెమెరాలు పెద్దగా లేకపోవడం పోలీసుల విచారణకు అవరోధంగా మారింది. అయితే వెంకటేశ్వరకాలనీలో నుంచి ఎటువైపు వెళ్లారు.. తప్పించుకునేందుకు ఉపయోగించిన వాహనాలను ఎక్కడ విడిచిపెట్టారన్న సమాచారం ఇప్పటి వరకు పోలీసులు కనుగొనలేకపోవడం గమనార్హం. వీరయ్య చౌదరిని హత్య చేసిన తరువాత బయటకు వచ్చినప్పటి సీసీ ఫుటేజీలు మినహా పెద్దగా సాక్ష్యాలు లభించలేదు. విచారణ పరిధి జిల్లా దాటి రాష్ట్ర సరిహద్దులు దాటిపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్ విసురుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పరిచయాలున్న నాయకుడి హత్య కావడంతో పాటు, సీఎం స్థాయిలో ఒత్తిడి వుండడంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
వీరయ్య చౌదరి కేసు విచారణకు రంగంలోకి ఎస్పీ దామోదర్ మూడు గంటలపాటు ప్రత్యక్ష సాక్షులను విచారించి వివరాల సేకరణ భూ వివాదాలతో పాటు అన్ని కోణాల్లో ముమ్మర దర్యాప్తు 40 మందిని అదుపులోకి తీసుకుని విచారించినా పురోగతి లేదు హంతకులు ఉపయోగించిన వాహనాలు ఎక్కడివి
40 మందిని అదుపులోకి తీసుకున్నప్పటికీ...
వీరయ్య చౌదరి హత్య జరిగిన రోజు రాత్రే పోలీసులు రంగంలోకి దిగారు. తొలుత ఆయన ఎంపీపీగా ప్రాతినిధ్యం వహించిన నాగులుప్పలపాడు గ్రామంలో కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద రైస్ మాఫియా హస్తం ఏమైనా ఉందా.? అనే కోణంలో విచారణ చేశారు. ఈ క్రమంలోనే పొన్నూరు నుంచి ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఒంగోలు తరలించారు. వారితో పాటు వీరయ్య చౌదరితో వివాదాలున్నట్లు భావిస్తున్న ప్రతిఒక్కరినీ పోలీసుస్టేషన్కు పిలిపించి విచారించినట్లు సమాచారం. మొత్తం మీద ఇప్పటి వరకు 40 మందిని విచారించగా ఎలాంటి క్లూ దొరకలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి వీరయ్య చౌదరి హత్య జరిగిన స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి మరిన్ని వివరాలడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఆ మూడు నిమిషాలు ఏం జరిగింది.?