
పొగాకు రైతులకు న్యాయం చేయాలి
మద్దిపాడు: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లి పొగాకు బోర్డులో జరుగుతున్న వేలంపాటను మంగళవారం ఆయన పరిశీలించారు. రైతులను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏ పంట వేసిన రైతు కూడా కూటమి ప్రభుత్వంలో సంతోషంగా లేరని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటకు మద్దతు ధర కల్పించకుండా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రైతులు తమ పంటలకు మద్దతు ధరలు లేక దళారులపాలై విలవిల్లాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వరి పంట వేసిన రైతులు పంటను అమ్ముకోలేకపోతున్నారని, అదేవిధంగా గత ఏడాది మంచి ధర పలికిన మిర్చికి ఈ సంవత్సరం ధరలు లేక రైతులు విలవిల్లాడిపోతున్నారని అన్నారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకొచ్చి మిర్చి రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తే ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి మిర్చి క్వింటాకు రూ.11 వేల మద్దతు ధరను ఇస్తామని చెప్పి ఆ విషయాన్ని గాలికి వదిలేశారన్నారు. ఈ ప్రాంతంలో పండే శనగ, మొక్కజొన్న పంటలకు కూడా సరైన మద్దతు ధర లేక దళారులు అతి తక్కువ ధరకు అడుగుతున్న క్రమంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో పొగాకు వ్యాపారులు సిండికేట్ అయి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొగాకు రైతుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తూ రూ.200 కోట్ల నిధులు మంజూరు చేసి, మార్క్ఫెడ్ ద్వారా రైతుల పొగాకును చివరి కేజీ వరకు కొనుగోలు చేయించారని గుర్తు చేశారు. ఆ తరువాత వరుసగా మూడేళ్ల పాటు రైతులు సరైన గిట్టుబాటు ధర పొందారన్నారు. గతంలో క్వింటా ధర రూ.36 వేల వరకు కొనుగోలు చేసిన పొగాకు కంపెనీలు ఇప్పుడు రూ.23 వేలకే కొనుగోలు చేయడానికి తటపటాయిస్తున్నాయని అన్నారు. వేలం కేంద్రానికి తీసుకొచ్చిన పొగాకు బేళ్లు సగానికి పైగా నోబిడ్ అవ్వడం అత్యంత దారుణం అని, పొగాకు పంట వేసిన కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసి, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే అవసరమైతే ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆయన రైతులకు మద్దతు ధర కల్పించలేని కూటమి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ వేలం కేంద్రం ఫ్లోర్లో బైఠాయించారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్లు పోలవరపు శ్రీమన్నారాయణ, దుంప చెంచిరెడ్డి, సీనియర్ నాయకులు గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి, నల్లమలుపు కృష్ణారెడ్డి, వాకా కోటిరెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి గుంతోటి రవి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు బి.శ్రీరామ్ మూర్తి, గుడ్డపాతల రవి, మద్దా లక్ష్మీనారాయణ ఉన్నారు.
వెల్లంపల్లి పొగాకు బోర్డు వద్ద బైఠాయించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ నిరసన