అంతర్‌జిల్లాల దొంగలు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్‌జిల్లాల దొంగలు అరెస్టు

Apr 22 2025 1:57 AM | Updated on Apr 22 2025 2:35 AM

అంతర్‌జిల్లాల దొంగలు అరెస్టు

అంతర్‌జిల్లాల దొంగలు అరెస్టు

సింగరాయకొండ: గంజాయి అక్రమ రవాణాతో పాటు దేవాలయాలు, గృహాలే లక్ష్యంగా చోరీకి పాల్పడుతూ జిల్లాలో సుమారు 70 దొంగతనాలకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల సొత్తు, నాలుగున్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ హజరత్తయ్య వివరాలు వెల్లడించారు. పేర్నమిట్టకు చెందిన చిడితోటి మధుబాబు, బాపట్ల జిల్లా బల్లికురవ మండలం రాకూరి దుర్గారావు, గుంటూరు జిల్లా లాలాపేట ఏరియాలోని పట్నం బజారులో నివసిస్తున్న తెలంగాణ రాష్ట్రం యాదగిరి గుట్ట మండలం యదగిరిపల్లి గ్రామానికి చెందిన పత్తి రవి, సింగరాయకొండ మండలం గుజ్జల యలమందారెడ్డినగర్‌కు చెందిన కుంచాల గురవమ్మలను అదుపులోకి తీసుకున్నామన్నారు. మధుబాబుపై తాళ్లూరు పోలీసుస్టేషన్లో మూడు, జరుగుమల్లిలో రెండు, అద్దంకిలో ఒకటి, నాగులుప్పలపాడులో రెండు, పొదిలిలో ఒకటి, వినుకొండలో ఒకటి, కందుకూరు రూరల్‌లో ఒక కేసు ఉన్నాయి.

రాకూరి దుర్గారావుపై తాళ్లూరులో రెండు, కందుకూరు రూరల్‌లో ఒక కేసు, పత్తి రవికి మద్దిపాడులో ఒకటి, సింగరాయకొండలో రెండు కేసులు ఉన్నాయన్నారు. మధుబాబు అంతర్‌జిల్లాల్లో సుమారు 70 వరకు చోరీలకు పాల్పడ్డాడన్నారు. ముఖ్యంగా దేవాలయాలే లక్ష్యంగా చోరీకి పాల్పడి ఆలయంలో ఉన్న గంట, ఇత్తడి సామాను, విగ్రహాలు, దేవుని మండపం, శిలాతోరణాలు ఇలా ఏ వస్తువుని వదలకుండా చోరీ చేసేవాడన్నారు. ఇళ్లలోకి చోరీకి వచ్చినప్పుడు బంగారం, వెండి వస్తువులతో పాటు విలువైన ఫర్నీచర్‌, రిఫ్రిజరేటర్లు, ఏసీలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు కూడా చోరీ చేస్తాడని వివరించారు. ఈ కేసులో అరెస్టు అయిన నలుగురిలో ఒకరైన వృద్ధురాలు కుంచాల గురవమ్మ పోలీస్‌స్టేషన్‌ సెంటర్‌లో శనక్కాయలు అమ్ముకుంటూ జీవించేది. శనక్కాయల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవటంతో రైలులో రాజమండ్రి వెళ్లి గంజాయి కేజీ రూ.1,500 కొనుగోలు చేసి ఇక్కడ రూ.5 వేలకు విక్రయిస్తుందని తెలిపారు. వృద్ధురాలి వద్ద మధుబాబు, దుర్గారావు, రవికుమార్‌లు కేజీ గంజాయి రూ.5 వేల కొనుగోలు చేసి విక్రయించేవారు. సోమవారం వీరు ముగ్గురు గురవమ్మ వద్దకు వచ్చి గంజాయి కొనుక్కొని వెళుతుండగా వారిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ హజరత్తయ్య వివరించారు. కేసులో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన సీఐ సీహెచ్‌ హజరత్తయ్య, ఎస్సై బి.మహేంద్ర, సిబ్బందిని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

దేవాలయాలే లక్ష్యంగా చోరీలు

నలుగురు నిందితులు అరెస్టు

గంజాయి రవాణాలో సిద్ధహస్తులు

రూ.10 లక్షల చోరీ సొత్తు, నాలుగున్నర కేజీల గంజాయి స్వాధీనం

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ హజరత్తయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement