
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం
కనిగిరిరూరల్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని.. వెంటనే రద్దు చేయాలని పలువురు ముస్లిం నేతలు డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు ను పార్లమెంటులో ఆమోదించడాన్ని నిరసిస్తూ కనిగిరిలో జమియత్ ఏ–ఉలమా, అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం కనిగిరిలో మహా నిరసన శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అగ్రభాగాన సుమారు 200 మీటర్ల జాతీయ పతాకాన్ని తీసుకుని ముస్లిం యువత నడిచారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు సయ్యద్ యాసిన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025 ను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. దేశంలో బీజేపీ సర్కార్ ముస్లింలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే ఈ బిల్లును తీసుకొచ్చారని ఆరోపించారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు సభ్యులుగా ముస్లిమేతరులను నియమించటం, ఎవరైతే వక్ఫ్ బోర్డుకు తమ ఆస్తులను, ధనాన్ని దానం చేయదల్చారో వారు ఐదేళ్ల పాటు ఇస్లాంను అనుసరిస్తున్నట్లుగా తగిన ఆధారాలు చూపించటం, వక్ఫ్ ఆస్తుల మీద ఏదైనా వివాదాలు వస్తే ట్రిబ్యునల్ కు కలెక్టర్ స్థాయి అధికారిని నియమించటం, రాష్ట్ర బోర్డు అధికారాలను తగ్గించి పూర్తిస్థాయి అధికారాలను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం, ఈ చట్టం అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఆరు నెలల్లోపు కేంద్ర ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డు సంబంధిత పత్రాలు సమర్పించకపోతే ఆ ఆస్తులన్నీ ప్రభుత్వ ఆస్తులుగా పరిగణించటం, వక్ఫ్ పరిరక్షణ లో పారదర్శకత లేదని కలెక్టర్లకు పూర్తి బాధ్యత కల్పించటం, తదితర అంశాలతో ప్రభుత్వ జోక్యం కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం ధార్మిక విషయాల్లో జోక్యం చేసుకొని తప్పుడు ఆలోచన విధానంతో ఈ అమెండ్మెంట్ చట్టం ను తీసుకొచ్చిందని తీవ్రంగా ఎండగట్టారు. మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, అంజుమున్ ఏ ఇస్లామియా కమిటీ అధ్యక్షుడు ఎస్ అహమ్మద్ హుస్సేనీ, మాజీ అంజుమన్ కమిటీ అధ్యక్షుడు రోషన్ సందాని, ముఫ్తీలు, మౌలానాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వక్ఫ్ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం వెంటనే చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీ స్థానిక షాదీ ఖానా వద్ద నుంచి ఎమ్మెస్సార్ రోడ్డు, వైఎస్సార్ రోడ్డు, పామూరు బస్టాండ్ వరకు సాగింది. అనంతరం వివిధ డిమాండ్లతో వినతి పత్రాన్ని ఆర్డీఓ జీ కేశవర్ధన్రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో జమియత్ ఉలమా, అంజుమన్ ఏ కమిటీ ఇస్లామియా కమిటీ, వివిధ సంఘాల నాయకులు ఎస్డీ షాహిద్, ఎస్కే డాక్టర్ రసూల్, ఎస్కే ఖాజా, ఎస్కే జంషీర్ అహమ్మద్, గుడిపాటి ఖాదర్, ఎస్కే ఫిరోజ్, ఎస్కే మస్తాన్వలి, ముస్తాఫా, పీసీ కేవవులు, మీరావలి, నాయబ్ రసూల్, రహీంబాష, ఆరీఫ్, ముస్లిం యూత్, వివిధ మసీద్ కమిటీల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
కనిగిరిలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మహా నిరసన శాంతి ర్యాలీ