
ఈదురు గాలులకు అపార నష్టం
గిద్దలూరు రూరల్: ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో మండలంలోని వెల్లుపల్లె, వెంగళ్రెడ్డి పల్లె, జయరాంపురం గ్రామాల్లోని పొగాకు, బొప్పాయి, అరటి తోటల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. 6 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ముండ్లపాడు ఏఈ కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా అందించారు. గాలివానతో పంట పొలాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సిమెంట్ దిమ్మెల మీద నుంచి కిందిపడిపోయాయి. దీంతో వ్యవసాయ బోర్లకు సంబంధించి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల పనులు సత్వరమే చేస్తామని ఏఈ తెలిపారు. గాలులతో వర్షం కురవడంతో కొన్ని ప్రాంతాల్లో అరటి చెట్టు నేలకొరిగాయి. వెల్లుపల్లె గ్రామానికి చెందిన వీరంరెడ్డి హనుమంతారెడ్డి రైతు పొగాకు పంట నేలకొరగడంతో సుమారు రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లింది. 5 ఎకరాల పొగాకు పంటలో ఎండిన పొగాకును బేళ్లుగా కట్టేందుకు ఉంచిన పందిళ్లు పూర్తిగా నేలమట్టమై వర్షంతో పొగాకు తడిసి పనికిరాకుండా పోయిందని రైతు వాపోయాడు. విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద చెట్టు కొమ్మలు సైతం రోడ్లకు అడ్డంగా పడ్డాయి. ప్రభుత్వం నష్టపోయన వారిని ఆదుకోవాలని రైతులు కోరారు.

ఈదురు గాలులకు అపార నష్టం

ఈదురు గాలులకు అపార నష్టం