ఒంగోలు అర్బన్: ప్రభుత్వ పెన్షనర్లకు తగ్గించిన అడిషనల్ క్యాంటమ్ను తిరిగి పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ నాయకులు తెలిపారు. స్థానిక ఎన్జీఓ హోం సమావేశ మందిరంలో సంఘం సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సంఘం అధ్యక్షుడు డీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు అన్నీ విధాలుగా సంఘం పనిచేస్తుందన్నారు. 2018 జులై నుంచి ఇవ్వాల్సిన డీఆర్ అరియర్స్, 11వ పే రివిజన్ అరియర్స్ను వీలైనంత త్వరగా ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 12వ పీఆర్సీతో పాటు ఐఆర్ ప్రకటించాలని కోరారు. పెన్షనర్లు బతికుండగానే అరియర్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. వయోవృద్ధులైన పెన్షనర్లకు హెల్త్కార్డుల ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అన్నీ హాస్పిటల్స్లో అందేలా ప్రభుత్వం చూడాలన్నారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటానికి పెన్షనర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తొలుత జాతీయ జెండాను ఎగురవేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. దీనిలో ఖజానా శాఖ డీడీ జగన్నాథరావు, జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అంకిరెడ్డి, సుబ్బారావు, ఇతర నాయకులు ఎం రామకృష్ణ, కే రామారావు, ఒంగోలు ఎస్టీవో రాజ్యలక్ష్మి, ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు శరత్బాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం 75 సంవత్సరాలు నిండిన 30 మంది పెన్షనర్లకు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ నాయకులు 75 ఏళ్లు నిండిన పెన్షనర్లకు సత్కారం