వాటరు కంటే..వైనే ఎక్కువ

Telangana: YS Sharmila Second Day Of Padayatra - Sakshi

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వైఎస్‌ షర్మిల తీవ్ర విమర్శలు 

మల్కారంలో ‘మాట ముచ్చట’ 

రెండో రోజు కొనసాగిన పాదయాత్ర

శంషాబాద్‌ రూరల్‌: ‘రాష్ట్రంలో ఇంగ్లిషు చదువులు లేవుగాని.. ఇంగ్లిషు సారా ఖుల్లా ఖుల్లాగా దొరుకుతుంది.. గల్లీ గల్లీకి వైన్‌ షాపులు ఉన్నాయి. వాటరు కంటే వైన్‌ ఎక్కువ దొరుకుతుందని మహిళలు చెబుతున్నారు... ఇదేనా బంగారు తెలంగాణ’అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. ‘ప్రజా ప్రస్థానం’ మహా పాదయాత్ర లో భాగంగా రెండోరోజు గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని మల్కారంలో ఏర్పాటు చేసిన ‘మాట ముచ్చట’కార్యక్రమంలో ఆమె స్థానికులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్‌ చేతుల్లో పెడితే.. బారుల తెలంగాణ, బీరుల తెలంగాణగా మార్చార ని దుయ్యబట్టారు. రైతులను రైతుబంధు పేరుతో ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు లు వ్యవసాయం చేసి ఏం లాభముంటుందన్నారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. రూ.25 వేలలోపు రుణాలకు సంబంధించి కేవలం 3 లక్షల మందికి మాఫీ చేసి 36 లక్షల మందికి రుణ మాఫీ ఎగ్గొట్టి మోసం చేశారని మండిపడ్డారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. పావలా వడ్డీ కూడా ఇవ్వడంలేదన్నారు. రాష్ట్రంలో 3,500 ప్రభుత్వ బడులను మూసి వేసి 14వేల మంది టీచర్లను తొలగించారని ఆరోపించారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందడంలేదన్నారు. ఏ ఒక్క వర్గం కూడా గ్రామాల్లో సంతోషంగా లేదని పేర్కొన్నారు. ‘ప్రభుత్వం గొర్రెలు, బర్రెలు ఇచ్చి కాసుకోమంటుంది. కూలీనాలీ చేసి కష్టపడి పిల్లలను చదివిస్తుంది ఇందుకోసమేనా’అని ప్రశ్నించారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. కేసీఆర్‌కు దున్నపోతు మీద వాన పడినట్లు ఉందన్నారు.

తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన మోసగాడు కేసీఆర్‌ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ పరిస్థితులు మారాలంటే మీలో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను ఎత్తి చూపడానికే ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను కేసీఆర్‌ పరిష్కరించకుంటే.. రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో వైఎస్సాఆర్‌ తెలంగాణ పార్టీని ఆశీర్వదిస్తే తన తండ్రి వైఎస్‌ఆర్‌ తరహాలో తానూ మంచి పాలన చేస్తానన్నారు.

నేడు శంషాబాద్‌లో యాత్ర
షర్మిల పాదయాత్ర మూడో రోజు శుక్రవారం కాచారం నుంచి మొదలై నర్కూడ మీదుగా సాయంత్రం శంషాబాద్‌ బస్టాండ్‌కు చేరుకుంటుంది. అక్కడ ప్రజా సమావేశం ఉంటుంది. రాత్రికి పోశెట్టిగూడ శివారులో బస చేస్తారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top